సాక్షి, చెన్నై: తమిళనాడులో సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చెన్నైలోని ఓ స్టార్ హోటల్ వేదికగా టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ హోటల్ను గుర్తించి, అక్కడి సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరికొందరు డీఎంకే, అన్నాడీఎంకే నాయకులను ఈ కేసు పరిధిలోకి తీసుకురావాలని పోలీసులు నిర్ణయించారు. అదే సమయంలో ఈ కేసులో కీలకంగా ఉన్న డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన సోదరుడు అశోక్కుమార్ తరఫున శుక్రవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
దర్యాప్తు ముమ్మరం
తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొన్ని బృందాలు చెన్నైలో టీవీకే ఎమ్మెల్యేలను కోట్లాది రూపాయలతో లొంగదీసుకు
నేందుకు ప్రయత్నించారని ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరంతా అన్నాడీ ఎంకే, డీఎంకేలకు చెందినవారే కావడం గమనార్హం. ఈ కేసులో డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్కుమార్ కీలకమని ఎఫ్ఐఆర్లో అతని పేరు చేర్చారు. సెంథిల్ బాలాజీ, అశోక్కుమార్ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.


