‘రాహుల్‌ యాత్రకు బెంగాల్‌లో కూడా అడ్డంకులు’ | Adhir Ranjan Chowdhury claims Rahul Yatra Facing Roadblocks West Bengal | Sakshi
Sakshi News home page

‘రాహుల్‌ యాత్రకు బెంగాల్‌లో కూడా అడ్డంకులు’

Jan 26 2024 6:49 PM | Updated on Jan 26 2024 7:58 PM

Adhir Ranjan Chowdhury claims Rahul Yatra Facing Roadblocks West Bengal - Sakshi

అధికార యంత్రాంగం మాత్రం అనుమతి ఇవ్వటం లేదని విమర్శించారు...

కోల్‌కతా: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’కు సంబంధించిన మీటింగ్‌లకు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(TMC) ప్రభుత్వం అనుమతి ఇవ్వటంలేదని రాష్ట్ర కాంగెస్‌ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు.

‘కొన్నిచోట్ల ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ కావాలని రోడ్డు అడ్డగింపు వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. బహిరంగ సమావేశాలకు కొన్ని ప్రాంతాల్లో అనుమతి లభించటం లేదు. అస్సాంతో సహా.. ఈశాన్య భారతంలో ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ పలు సమస్యలను ఎదుర్కొటోంది. ప్రస్తుతం టీఎంసీ ప్రభుత్వం ఉ‍న్న పశ్చిమ బెంగాల్‌లో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం’ అని బెంగాల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అధీర్ రంజన్ చౌదరి అన్నారు.

అయితే తాము పశ్చిమ బెంగాల్‌ కొన్ని చోట్ల రాహుల్‌ యాత్రకు మినహాయింపులు లభిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం అనుమతి ఇవ్వటం లేదని విమర్శించారు.  

అధీర్‌ రంజన్‌ చౌదరి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ శంతను సేన్‌ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్‌లోని అధికార యంత్రాంగం రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా వ్యవహరిస్తోందని కౌంటర్‌ ఇచ్చారు. ‘బెంగాల్‌లో ‘ఇండియా కూటమి’ ఉనికి కోల్పోవటానికి అధీర్‌ రంజన్ బాధ్యత వహించాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు బెంగాల్‌లో సమావేశాలు నిర్వహించుకున్నా..ఎవరికీ ఇబ్బందులు కలగవు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది’ అని శంతను సేన్‌ అన్నారు.

ఇక.. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేయటానికి కాంగ్రెస్‌ చీఫ్‌ అధీర్‌ రంజన్‌ కారణమని టీఎంసీ ఎంపీ డెరెక్‌ ఒబ్రెయిన్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అధీర్‌ రంజన్‌.. బీజేపీ వారిలా మాట్లాడేవారని మండిపడ్డారు.

రాహుల్‌ యాత్ర గురువారం అస్సాం నుంచి బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌ జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అయితే రోడ్డు షోలో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం, శనివారం ఆయన తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

ఇక.. 28వ తేదీన మళ్లీ యాత్ర ప్రారంభంకానుంది. మరుసటి రోజు రాహుల్‌ యాత్ర బిహార్‌లో ప్రవేశించనుంది. అటుపై 31న పశ్చిమ బెంగాల్‌లోకి వెళ్లనుంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్‌..  పశ్చిమ బెంగాల్‌ వెళ్లటం ఇదే తొలిసారి. అందుకే రాహుల్‌ యాత్రపై టీఎంసీ అడ్డంకులు సృష్టించనుందని అధీర్‌ రంజన్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

చదవండి:  ‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్‌ కుమారే ప్రధాని!’

Advertisement
 
Advertisement
Advertisement