ప్రభుత్వంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆగ్రహం | BRS Condemns Attack on Yadadri Temple Board Member Eshwaramma Yadav | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆగ్రహం

Jul 17 2026 10:40 PM | Updated on Jul 17 2026 10:40 PM

BRS Condemns Attack on Yadadri Temple Board Member Eshwaramma Yadav

సాక్షి,హైదరాబాద్‌: యాదాద్రి ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలు, మాజీ కార్పొరేటర్ ఈశ్వరమ్మ యాదవ్‌పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. చింతకుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాధితురాలైన ఈశ్వరమ్మ యాదవ్‌కు వెంటనే గన్‌మెన్ భద్రత కల్పించాలని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఈశ్వరమ్మ యాదవ్ ఎల్‌బీ నగర్‌లో అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్‌గా గెలుపొందారని, గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా సేవలందిస్తున్న నాయకురాలని ఆయన తెలిపారు. అలాంటి మహిళా నాయకురాలిని అవమానిస్తూ మాట్లాడటమే కాకుండా, దాడికి పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని విమర్శించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే భాషనే శివచరణ్ రెడ్డి కూడా అనుసరిస్తున్నారని ఆరోపించిన ఆయన, ఈశ్వరమ్మ యాదవ్‌ను అవమానించిన అనంతరం శివచరణ్ రెడ్డికి 1+1 గన్‌మెన్ భద్రత కల్పించారని, కానీ దాడికి గురైన 80 ఏళ్ల ఈశ్వరమ్మ యాదవ్ మాత్రం భయాందోళనల మధ్య ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు.

బాధితురాలికి భద్రత కల్పించకుండా, నిందితులకు గన్‌మెన్ సెక్యూరిటీ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబిస్తోందని ఆయన విమర్శించారు. బీసీలు, పేద వర్గాలపై కాంగ్రెస్ నాయకులు చులకన భావంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఘటనపై విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో బీసీ నాయకులకు చోటు కల్పించలేదని, జగ్గా రెడ్డి, నరసింహా రెడ్డితో కమిటీ వేసినప్పటికీ బాధితులను కలిసి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. అలాగే, శివచరణ్ రెడ్డికి ఇప్పటివరకు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదని విమర్శించారు.

షబ్బీర్ అలీకి వెంటనే షోకాజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వం,ఈ ఘటనలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన ఆయన, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా స్పందించలేదని అన్నారు.

రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని షాబాద్‌లో ఆరుగురు మహిళల హత్యలు పోక్సో కేసుల్లో నిందితులకు బెయిల్ లభిస్తున్న ఘటనలు మహిళల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా వ్యతిరేక, బహుజన వ్యతిరేక విధానాలతో వ్యవహరిస్తోందని ఆరోపించారు.

బీసీలకు పదవులు ఇచ్చినట్లు చూపిస్తూ.. వెనుక నుంచి వారిని అణచివేస్తున్నారని విమర్శించిన ప్రవీణ్ కుమార్,యాదాద్రి ఆలయ కమిటీ బోర్డు సభ్యురాలైన ఈశ్వరమ్మ యాదవ్‌కు వెంటనే గన్‌మెన్ సెక్యూరిటీ కల్పించాలని, ఎలాంటి అధికారిక హోదా లేని శివచరణ్ రెడ్డికి భద్రత ఎలా కల్పించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement