జయపురం: జయపురం సబ్డివిజన్ బొయిపరిగుడ సమితిలో ఇటీవల ఎలుగుబంట్ల బెడద ఎక్కువగా ఉంది. అవి ఎప్పుడు వస్తాయో ఎలా దాడులు జరుపుతాయోనని ఎలుగుబంటి ప్రభావిత గ్రామాల ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బొయిపరిగుడ సమితి ఎలుగుబంటి ఖొరాగుడ, కదమగుడ, బొడొగుడ గ్రామాలపై గురువారం సాయంత్రం దాడి చేసి ఆరుగురు వ్యక్తులను తీవ్రంగా గాయపరచినట్లు సమాచారం. గాయపడిన వారు ఖొరాగుడ గ్రామం కృష్ణ బొడొనాయిక్, ఘాశీ బొడొనాయిక్, హరి తొలియ, రతన్ మఝి ఉన్నారు. కదమగుడ గ్రామంలో ఎలుగుబంటి దాడిలో సునాదర పూజారి, బొడొగుడ గ్రామంలో హరి గాయపడ్డారు. గ్రామస్తుల వివరణ ప్రకారం ఖొరాగుడ గ్రామ సమీపంలోగల పంట భూములలో రైతులు దుక్కులు దున్ను తున్న సమయంలో ఎలుగు బంటి దాడి జరిపి వారిని తీవ్రంగా గాయపరచింది. ఎలుగు బంటి దాడి జరిపి గ్రామస్తులను గాయపరచటం చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గాయపడిన వారందరినీ బొయిపరిగుడ కమ్యూనిటీ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారికి డాక్టర్లు ప్రాథమిక చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు.


