● మయూర్భంజ్కు రెడ్ వార్నింగ్
భువనేశ్వర్: రాష్ట్రంలో 29 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతంలో గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వరకు ఉంటుందనే ముందస్తు సమాచారంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. గంగా నది తీర పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్పై ఏర్పడిన తుఫాను వలయం ప్రభావంతో రాగల 24 గంటల్లో వాయువ్య బంగాళా ఖాతం, పరిసర పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఆగస్టు 8, 9 తేదీల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మయూర్భంజ్ జిల్లాకు రెడ్ హెచ్చరిక జారీ అయ్యింది.
ఆరెంజ్ హెచ్చరిక
బాలాసోర్, భద్రక్, కటక్, సుందర్గడ్, అనుగుల్, ఢెంకనాల్, కెందుఝొర్, సువర్ణపూర్, బౌధ్, బొలంగీర్, కలహండి, కంధమల్, గజపతి మరియు గంజాం సహా 14 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచనతక్ష ఆరెంజ్ హెచ్చరిక జారీ అయ్యింది.
పసుపు హెచ్చరిక
జాజ్పూర్, కేంద్రాపడా, పూరీ, ఖుర్దా, నయాగఢ్, జగత్సింగ్పూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్గిరి, నవరంగ్పూర్, నువాపడా బర్గడ్, సంబల్పూర్, ఝార్సుగుడ మరియు దేవగడ్లతో సహా 15 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం సంకేతంతో పసుపు హెచ్చరిక జారీ అయ్యింది.
ఒడిశా తీరం వెంబడి గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్లు ఉండగా గరిష్టంగా గంటకు 60 కిలో మీటర్ల వరకు ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఆగస్టు 7 నుంచి 8 వరకు సముద్రం అల్లకల్లోలంగా లేదా అత్యంత అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ వ్యవధిలో సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు.


