కొరాపుట్: నబరంగ్పూర్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ చరిత్ర పరిశోధకుడు ఆచార్య బిజయ మిశ్ర అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డులోని ఒక ప్రైవేటు హోటల్లో ఆయన సంస్మరణ సభను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు మున్నా త్రిపాఠి, సంఘ సేవకుడు జగన్నాథ మహాపాత్రో తదితరులు బిజయ మిశ్ర సేవలు గుర్తు చేసుకున్నారు. సాహితీ రంగం, చారిత్రాత్మక పరిశోధన, అధ్యాపక వృత్తి, రచనలతో ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పలువురు కవులు, విద్యావేత్తలు, సంఘ సేవకులు పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన అవసరం
జయపురం: ప్రతి ఒక్కరికీ చట్టాలపై అవగాహన అవసరమని కొరాపుట్ జిల్లా న్యాయసేవా ప్రదీకరణ జయపురం సభ్యులు పేర్కొన్నారు. స్థానిక అరవింద నగర్ ఇరిగేషన్ కాలనీ సాయి అరవింద ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రాంగణంలో చట్టాలపై అవగాహన శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చట్టాలపై జిల్లా న్యాయసేవా ప్రదీకరణ కార్యదర్శి ప్రద్యోమయీ సుజాత వివరించారు. అలాగే విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో చైల్డ్ లీగల్ బోర్డు ప్రిన్సిపాల్ మెజిస్ట్రేట్ మధుస్మిత జెన, లీగల్ డిఫెన్స్ చీఫ్ కౌన్సిల్ ప్రమోద దాస్, రచనా రౌత్, లీగల్ ఎయిడ్ అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ ఉదిత్ నారాయణ ప్రసాద్, అరవింద ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సెంటర్ హెచ్ఎం సుశ్మిత మహంతి తదితరులు పాల్గొన్నారు.
గుమ్మ బ్లాక్లో
వర్షాభావ పరిస్థితులు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు గుమ్మాబ్లాక్లో స్పష్టంగా కనిపిస్తున్నా యి. గుమ్మాబ్లాక్లో అంబాజరి గ్రామంలో వరి నారు కాపాడుకోవడానికి భార్యా, భర్తలు పక్కన ఉన్న నూతి నుంచి నీటిని తోడి నారుమడికి అందజేసిన ఘటన రైతుల్లో ఆందోళన కనిపిస్తుంది. అంబాజరి గ్రామంలో దీపక్ గో మాంగో, డంబురు గోమాంగో, సరసునీ గోమాంగో బావిలో నీటిని తోడి నారుమళ్లు వేస్తున్నట్టు తెలియజేశారు.
పాముకాటుకు ఇద్దరు బలి
పర్లాకిమిడి: గజపతి జిల్లా రాయగడ బ్లాక్ జోల్లోంగో గ్రామ పంచాయతీ కడంతోలో గ్రామంలో గురువారం రాత్రి విషసర్పాలు కరిచి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గురువారం రాత్రి కడంతోలో గ్రామంలో అజయ్కుమార్ బోడోరయితో తన భార్య లలితా, కొడుకు అమిత్కుమార్ బోడోరయితో, రెండేళ్ల కూతురు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రెండు విషసర్పాలు ఇంట్లోకి వచ్చి భార్య, కొడుకు చేతిపై కాటేశాయి. వారిద్దరూ నురగలు కక్కుతుండగా తండ్రి అజయ్ కుమార్ లేచి చూడగా రెండు విషసర్పాలు కరిచి వెళ్లిపోతుండం గమనించాడు. వాటిని చంపి భార్య లలితా, కొడుకు అమిత్ కుమార్ (7)లను వారి బంధువుల సాయంతో తొలుత రాయగడ బ్లాక్ ఆరోగ్యకేంద్రానికి తరలించాడు. అయితే అక్కడ వైద్యం లభించకపోవడంతో వెంటనే పర్లాకిమిడి ప్రభుత్వ మెడికల్కు తరలించాడు. చికిత్స చేస్తుండగానే వారు ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.


