టెక్కలి రూరల్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఒక ఫాస్ట్ఫుడ్ సెంటర్లో శుక్రవారం కొట్లాట జరిగి ఇద్దరికి గాయాలయ్యాయి. ఇద్దరినీ ఆస్ప త్రిలో చేర్చారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. నందిగాం మండలం ఆకుల రఘునాథపురం గ్రామానికి చెందిన కె.కేశవరావు(ఆర్మీ ఉద్యోగి) అనే వ్యక్తి టెక్కలి ఫాస్ట్ఫుడ్ సెంటర్లో తిన్న తర్వాత అక్కడ బిల్లు కట్టే విషయంలో ఆ సెంట ర్లో పనిచేస్తున్న మహ్మద్ రాజ్ అనే వ్యక్తితో గొడవ జరిగింది. గొడవలో కేశవరావు అక్కడ ఉన్న సిబ్బందిపై దాడి చేశాడు. ఈ క్రమంలో మహ్మద్ రాజ్ తలపై కొట్టడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో అతడిని హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇదే గొడవలో కేశవరావుకి సైతం చిన్నపాటి గాయం తగలడంతో ఆ వ్యక్తిని సైతం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
హిరమండలం: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం నుంచి బత్తిలి వెళ్తున్న బస్సు గురువారం రాత్రి పాత హిరమండలంలోని కొత్త గౌడవీధి వద్ద ఒక్కసారిగా అదుపు తప్పింది. వర్షం పడుతున్న సమయంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. మట్టిలో కూరుకుపోయి నిలిచిపోయింది. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా కుదుపునకు గురికావడంతో ఆందోళనకు గురయ్యారు. మట్టిలో కూరుకుపోయి నిలిచిపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. శుక్రవారం జేసీబీ సాయంతో గ్రామస్తులు బస్సును గోతి నుంచి బయటకు తీశారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామ సమీప రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సంతబొమ్మాళి మండలం విష్ణుచక్రం గ్రామానికి చెందిన ఎన్.రవి అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై పలాస వైపు బయల్దేరారు. కొల్లిపాడు పంచాయతీ గంటపేట గ్రామానికి చెందిన ఎస్.కృష్ణారావు తన భార్యతో కలసి ద్విచక్రవాహనం పై వస్తుండగా పెద్దమర్రిపాడు వద్ద ఈ రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రవి, కృష్ణారావులకు తీవ్ర గాయాలు కావడంతో టెక్కలి జి ల్లా ఆస్పత్రికి తరలించారు. నౌపడ పోలీసులు కేసు నమోదు చేశారు.
‘వ్యవసాయానికి నీరు ఇవ్వలేం’
రణస్థలం: తోటపల్లి కాలువలకు నీరు వచ్చినా తా గునీటికి ప్రాధాన్యత ఇవ్వగలం తప్ప వ్యవసాయానికి అందించలేమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రణస్థలం మండలంలోని వెల్పురాయి గ్రామంలో రైతన్నా మీ కోసం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాల్లో రెండు తప్ప అన్నీ ఇచ్చేశామన్నారు. వర్షపాతం రాష్ట్రంలో 55శాతం లోటు ఉందని, రణస్థలం మండలంలో 49శాతం ఉందని, రణస్థలంలో భూగర్భ జలాలు అట్టడుగున ఉన్నాయని తెలిపారు. తొలుత వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్లు మాట్లాడుతూ నవ ధాన్యాలు సాగు చేయాలని సూచించారు.
నేడు, రేపు రాష్ట్రస్థాయి
సాఫ్ట్బాల్ సెమినార్
శ్రీకాకుళం న్యూకాలనీ: సాఫ్ట్బాల్ క్రీడలో సరికొత్త విధి విధానాలు, నియమ నిబంధనలను క్రీడాకారులకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళంలోని క్రిష్టల్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ వేదికగా శని, ఆదివారాలు ఏపీ రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ సెమినార్ కమ్ అంపైర్ క్లినిక్ నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలల ప్రతినిధులతోపాటు క్రీడాకారులు హాజరుకానున్నట్టు ఏపీ సాఫ్ట్బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకట రమణ తెలిపారు.
జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల జాబితా వెల్లడి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారుల జాబితాను ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి వెల్లడించారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ క్రీడామైదానం వేదికగా ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2026 పోటీల్లో పాల్గొనే 76 మంది క్రీడాకారుల జాబితాను ప్రకటించారు. అండర్–14, అండర్–16, అండర్–18, అండర్–20 బాలబాలికల వయో విభాగాల్లో జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే అథ్లెట్స్ ఈనెల 9వ తేదీన రాత్రి 9 గంటలకు తమ లగేజీతోపాటు పత్రాలు, మూడు పాస్ ఫొటోలతో ఆమదాలవలస రైల్వేస్టేషన్ వద్ద సంఘ ప్రతినిధులు కె. మాధవరావు, చల్లా తవిటిరాజుల వద్ద రిపోర్ట్ చేయాలని మధుసూదన్, సాంబమూర్తి కోరా రు. మరిన్ని వివరాలకు 8500271575 నంబర్ ను సంప్రదించాలని వారు సూచించారు.


