కొరాపుట్: దండకారణ్యంలో వెలసిన సహజ సిద్ధ పుణ్యక్షేత్రం గుప్తేశ్వరంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రావణ మాసం సోమవారం శివుడిని దర్శించుకోవడానికి బోల్ భం భక్తులు పోటెత్తారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. మంగళవారం ఉదయం వరకు వందలాది భక్తులు గుప్తేశ్వరం నుంచి బయటకు రాలేకపోయారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు వందలాది వాహనాలు రామగిరి–గుప్తేశ్వరం మధ్య నిలిచిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా వేలాది జనం ముందు నిలువ లేక పోయాయి. సుమారు 40 వేల మంది పైగా భక్తులు తరలి వచ్చారు. దాంతో భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. పాత్రో పుట్ సమీపంలో బ్రిటిష్ వంతెన వద్ద పుణ్య జలం కోసం పూజలు చేశారు.వర్షం వల్ల ఆ ప్రాంతం బురదగా మారింది. జాతీయ రహదారి దిగి నది వద్దకు వెళ్లడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక మంది రాతి మెట్లు ఎక్కతూ కిందకు పడి పోయారు. రామగిరి నుంచి గుప్తేశ్వరం వరకు మార్గంలో విద్యుత్ స్తంభాలు లేవు. దాంతో రాత్రి పూట నడిచే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు సమాజ సేవకులు కిరోసిన్ దీపాలు చెట్లకి అమర్చారు. ఆ వెలుగు లోనే వందలాది మంది భక్తులు నానా బాధలు పడుతూ పాద యాత్ర చేశారు. మరో వైపు వేలాది మంది కాలకృత్యాలు తీసుకోవడానికి శబరి నది వద్దకు రావడం తో ఆ ప్రాంతం దుర్గంధంగా మారింది. సీ్త్రలు కాలకృత్యాల కోసం అనేక బాధలు పడ్డారు. గుప్తేశ్వరం దర్శించుకోవడానికి గుహ గుండా దిగే మార్గం చాలా చిన్నది. దాంతో గుహ బయట నంది విగ్రహం వద్ద భక్తులు తోపులాటకి గురయ్యారు. రానున్న సోమవారం వేలాది మంది భక్తులు గుప్తే
శ్వరానికి రానున్న సందర్భంలో ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.


