నాలుగు సమితుల్లో
రాయగడ: జిల్లాలో ఏనుగుల సంచారం ఇటు రైతులకు, అటు గ్రామీణ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోని కళ్యాణసింగుపూర్, మునిగుడ, బిసంకటక్, గుణుపూర్ సమితుల్లోనిల వివిధ గ్రామాల్లో దాదాపు 17 ఏనుగులు సంచరిస్తున్నట్లు బాధితులు తెలిసారు. ఆహారం కోసం అడవులు, కొండ ప్రాంతాల నుంచి సరాసరి జనవాసాల్లోకి చొరబడుతున్న గజరాజుల గుంపులు ఆయా ప్రాంతాల్లో గల పంటలను, నిల్వ ఉంచుకున్న సామగ్రిని ధ్వంసం చేస్తున్నాయి. ప్రధానంగా వేరుశనగ, అరటి, వరి, పత్తి తదితర పంటలను ఇవి యథేచ్ఛగా ధ్వంసం చేస్తూ రైతుల కంట కన్నీరు మిగులుస్తున్నాయి. నియమగిరి పర్వత ప్రాంతాల్లో ఏనుగుల సంచారం అధికంగా ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 13 ఏనుగులు సంచరిస్తుండగా ఆహారం కోసం అవి తరచూ కళ్యాణసింగుపూర్, బిసంకటక్ ప్రాంతాల్లో ఉన్న దిగువ గ్రామాల్లోకి చొరబడి నానా రభస సృష్టిస్తున్నాయి. గత కొద్ది రొజుల క్రితం అర్ధరాత్రి నియమగిరిలోని కృషముయి గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు నుంచి రెండు ఏనుగులు విడిపొయి కళ్యాణసింగుపూర్ సమితిలోని కేశవ్ నాయక్గుడ, నువాసాహి, ఘగుడిమాల్, లహరి ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. గ్రామ సమీపంలో హఠాత్తుగా ఏనుగులు కనిపించడంతో గ్రామస్తులు భయబ్రాంతులకు గురయ్యారు. కేశవ్నాయక్గుడ రైతులు సాగు చేస్తున్న పత్తి, శనగ పంటలను ఏనుగులు తొక్కి ధ్వంసం చేయగా, ఘాగుడిమాల్ లహారాసాహిలో నాటిన వరి పొలాల్లోకి ప్రవేశించి భారీ పంట నష్టాన్ని కలిగించాయి. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ ఫారెస్టర్ భగవాన్ సరకతొ పాటు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పంట నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తరఫున సహాయం అందించేందుకు హామీ ఇచ్చారు.
గుణుపూర్ అటవీ ప్రాంతంలోని కుకురుగుడా పరిసరాల్లో మరొ నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఇందులో మూడు ఆడ ఏనుగులు, ఒక మగ ఏనుగు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఈ గుంపు గజపతి జిల్లా కాశీనగర్ ప్రాంతంలో సంచరించగా, అనంతరం ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లినట్లు సంబంధిత శాఖ అధికారులు గుర్తించారు. అయితే ఆహారం కోసం అవి తిరిగి ఈ ప్రాంతానికి చేరుకున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో ఏనుగుల సంచారం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.


