● కార్మికుల హక్కులను కాపాడాలని డిమాండ్ ● కేంద్రం తీరు మార్చుకోవాలని నినాదాలు
రాయగడ: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, వ్యవసాయ విధానాలను వ్యతిరేకిస్తూ శ్రామిక నాయకులు రాయగడలోని కపిలాస్ కూడలి వద్ద జైల్ భరో ఆందోళన కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. కార్మికులు, రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు ఐక్యంగా పోరాటం చేయాలని ఐఎన్టీయూసీ, ఆలిండియా కృషక్ మోర్చా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనలొ శ్రామిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ప్రజా పనుల శాఖ బంగ్లా నుంచి ఆందోళనకారులు ర్యాలీగా కపిలాస్ కూడలికి చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐఎన్టీయూసీ నాయకుడు భవాణీ జెన్న, ఆలిండియా కృషక్ మోర్చా నాయకులు తిరుపతి గోమాంగో ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో భాగంగా స్థానిక ఫ్లై ఒవర్ బ్రిడ్జి వద్ద బైఠాయించారు. దీంతో ఆయా మార్గాల్లో వాహనాల రాకపోకలు సుమారు గంటన్నర నిలిచిపోయాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి విరమించాలని విజ్ఞప్తి చేశారు. యితే తాము చేస్తున్నది ప్రజల కోసమేనని అందుకు సహాకరించాలని జెన్న పోలీసులను కోరారు. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఫ్లై ఓవర్బ్రిడ్జిపై వందలాది వాహనాలు బారులు తీరాయి. ట్రాఫిక్కు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆందోళనను విరమించాలని పోలీసులు పట్టుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారులమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ
ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకుడు భవాణీ జెన్న మాట్లాడుతూ.. దేశంలోని కార్మికులు తమ హక్కులు, ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, సామాజిక భద్రత కోసం చాలాకాలంగా పోరాడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని ఆరోపించారు. కార్మిక చట్టాల్లో మార్పులు చేయడంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రాధాన్యమిస్తుందని అన్నారు. జూలై 25 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్మిక సమ్మేళనాలు, నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలిండియా కృషక్ మోర్చా నాయకులు గొమాంగో కోరారు. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


