సలహా కమిటీ అడుగులు ముందుకు.. | Telangana NRI advisory committee service | Sakshi
Sakshi News home page

సలహా కమిటీ అడుగులు ముందుకు..

Apr 21 2025 7:45 PM | Updated on Apr 21 2025 7:55 PM

Telangana NRI advisory committee service

స్వర్గం శ్రీనివాస్‌ పాడె మోస్తున్న ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్న కమిటీ

యూఏఈ నుంచి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంలో చొరవ

మృతుల కుటుంబ సభ్యులకు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఉద్యోగాలు

కృతజ్ఞతలు తెలుపుతున్న గల్ఫ్‌ కార్మిక కుటుంబాలు

మోర్తాడ్‌ (బాల్కొండ): తెలంగాణ ప్రవాసీ విధానం (ఎన్‌ఆర్‌ఐ పాలసీ) రూపకల్పన, గల్ఫ్‌ బోర్డు ఏర్పాటు కోసం నిర్దేశించిన గల్ఫ్‌ సలహా కమిటీ అడుగులు ముందుకు పడ్డాయి. సలహా కమిటీ బాధ్యతలను స్వీకరించిన వారం రోజులలోనే యూఏఈలో ఒక దుర్ఘటన చోటు చేసుకోవడం, ఈ అంశంలో కమిటీ సభ్యులు వేగంగా స్పందించి మృతదేహాలను స్వదేశానికి తెప్పించడంతో బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.

యూఏఈలోని ఆల్‌కూజ్‌ ప్రాంతంలోని బేకరీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తి చేతిలో నిర్మల్‌ జిల్లా సోన్‌కు చెందిన ప్రేమ్‌సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమన్నపేట్‌కు చెందిన స్వర్గం శ్రీనివాస్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 11న వీరు హత్యకు గురి కాగా వారం రోజుల వ్యవధిలోనే మృతదేహాలను స్వదేశానికి తెప్పించారు. ఇందులో సలహా కమిటీ కీలకపాత్ర పోషించింది. గల్ఫ్‌ సలహా కమిటీ చైర్మన్‌ వినోద్‌కుమార్, వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులతో యూఏఈ ఘటనపై చర్చించారు. సీఎంవో నుంచి కేంద్ర ప్రభుత్వానికి, విదేశాంగ శాఖకు సమాచారం అందించడంతో వారం రోజులలోనే మృతదేహాలను స్వదేశానికి తీసుకురాగలిగారు. గతంలో గల్ఫ్‌లో ఎవరైనా మరణిస్తే మృతదేహం ఇంటికి రావడానికి నెల రోజుల వరకు సమయం పట్టేది.  

బాధిత కుటుంబాలకు భరోసా 
యూఏఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. సలహా కమిటీ విజ్ఞప్తి మేరకు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. హత్యకు గురైన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఏదైనా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. గల్ఫ్‌ భరోసా కింద రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

అంత్యక్రియలకు ప్రభుత్వ సాయం 
స్వర్గం శ్రీనివాస్‌ అంత్యక్రియలకు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రూ.15 వేల ఆర్థికసాయం మంజూరుచేశారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకు మాత్రమే ప్రభుత్వ సాయం అందుతుంది. గల్ఫ్‌లో హత్యకు గురైన ఘటనను మానవతా దృక్పథంతో పరిగణనలోకి తీసుకున్న జగిత్యాల జిల్లా (Jagtial District) కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తన విచక్షణాధికారాలను ఉపయోగించుకుని స్వర్గం శ్రీనివాస్‌ అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు.

చ‌ద‌వండి: స్మిత స‌బ‌ర్వాల్ ధిక్కార స్వరం!

శనివారం జరిగిన శ్రీనివాస్‌ అంతిమ యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పాల్గొని పాడె మోశారు. ఆయన కూడా సొంతంగా రూ.10 వేల సాయం అందించారు. ఇద్దరు మృతుల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రకటించారు. సలహా కమిటీ ఏర్పడిన వెంటనే గల్ఫ్‌ ప్రవాసులకు ప్రయోజనం కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంపై గల్ఫ్‌ కార్మిక కుటుంబాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement