రౌడీ షీటర్‌ దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

రౌడీ షీటర్‌ దారుణ హత్య

Jun 3 2023 11:48 AM | Updated on Jun 3 2023 11:49 AM

- - Sakshi

నిజామాబాద్: ఎడపల్లి మండల కేంద్ర శివారు నిజామాబాద్‌ రోడ్డులో రౌడీ షీటర్‌ ఆరిఫ్‌ డాన్‌ను ప్రత్యర్థులు పట్టపగలు హత్య చేశారు. ఆరిఫ్‌ డాన్‌ గురువారం ఓ దొంగతనం కేసులో బోధన్‌ కోర్టుకు పేషీపై వెళ్లాడు. కోర్టు వాయిదా పడటంతో తిరిగి నిజామాబాద్‌కు స్నేహితుడు బుల్లెట్‌ ఖాదర్‌, మరో ఇద్దరితో కలిసి రెండు బైక్‌లపై వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆరిఫ్‌ డాన్‌, బుల్లెట్‌ ఖాదర్‌ కలిసి వస్తున్న బుల్లెట్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇద్దరు కింద పడిపోయారు. లారీలోంచి ఎనిమిది మంది దిగి వీరిద్దరిపై కత్తులతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఆరిఫ్‌డాన్‌ రక్తపు మడుగులో పడి అక్కడిక్కడే చనిపోయాడు.

బుల్లెట్‌ ఖాదర్‌ కాలు విరిగింది. తలపై కత్తిపోట్టు పడ్డాయి. వీరివెంట మరో బైక్‌పై వస్తున్న ఇద్దరు పారిపోయినట్లు తెలిసింది. ఘటన స్థలాన్ని ఏసీపీ కిరణ్‌కుమార్‌, ఇద్దరు సీఐలు పరిశీలించారు. ఏసీపీ మాట్లాడుతూ ఆరిఫ్‌ ఓ దొంగతనం కేసులో బోధన్‌కోర్టుకు వెళ్లి వస్తుండగా ఈ హత్య జరిగినట్లు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి 1న నగర శివారులోని సారంగపూర్‌ వద్ద జరిగిన ఒకరి పుట్టిన రోజు వేడుకలకు ఆరిఫ్‌, ఇబ్రహీంఛావూస్‌ అలియాస్‌ జంగిల్‌ ఇబ్బు హాజరయ్యారు.

సాంగ్‌ వేసే విషయంలో గొడవ జరిగి ఇబ్రహీంఛావూస్‌ను ఆరిఫ్‌డాన్‌ అతని అనుచరులు కత్తులతో దాడిచేసి హతమార్చారు. ఈ కేసులో మూడు నెలల క్రితమే ఆరీఫ్‌డాన్‌ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆరిఫ్‌ హత్యలో సిద్దు, కరీంలాల, సమద్‌, ఇర్ఫాన్‌, సోహెల్‌, హద్దు, చోటసోహైల్‌ అనే వ్యక్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇబ్రహీంఛావూస్‌, ఆరిఫ్‌డాన్‌ గతంలో కలిసి ఇల్లీగల్‌ దందా చేసేవారని తెలిసింది. పంపకాలలో వచ్చిన తేడాతోనే ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుని ఇద్దరూ హతం అయ్యారు. దీని వెనుక పాత రౌడీషీటర్ల హస్తంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement