లక్నో: ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్, గూగుల్ మ్యాప్స్ తోడు లేకుండా అడుగు బయటకు అడుగువేయలేం. అయితే అదే టెక్నాలజీని గుడ్డిగా నమ్మితే జీవితాలే తలకిందులవుతాయని నిరూపించే ఒక ఘటన వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్లో యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్ష రాయడానికి బయల్దేరిన నలుగురు అభ్యర్థులు, గూగుల్ మ్యాప్స్ చూపించిన దారిలో వెళ్లి, పరీక్షా కేంద్రానికి బదులు పంట పొలాల్లోకి చేరుకున్నారు. తప్పు తెలుసుకుని పరీక్షా కేంద్రానికి పరుగులు తీసేసరికి సమయం దాటిపోవడంతో, వారి ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది.
గూగుల్ మ్యాప్స్ మాయ
విశాల్, ధర్మేంద్ర మాలిక్, అరుణ్ కుమార్, నకుల్ కుమార్ అనే నలుగురు అభ్యర్థులు ముజఫర్నగర్లోని ‘దీప్చంద్ గ్రెయిన్ ఛాంబర్ ఇంటర్ కాలేజ్’లో పరీక్ష రాయాల్సి ఉంది. వారు తమ అడ్మిట్ కార్డ్లోని సెంటర్ కోడ్ను గూగుల్ మ్యాప్స్లో ఎంటర్ చేసి ప్రయాణమయ్యారు. అయితే, ఆ మ్యాప్ వారిని పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సింది పోయి, షామ్లీ జిల్లాలోని జాంధేరి గ్రామంలోని వ్యవసాయ పొలాల మధ్యకు తీసుకెళ్లింది. చుట్టూ చూస్తే కాలేజీ కాకుండా పంట పొలాలు కనిపించడంతో వారు షాక్కు గురయ్యారు. తాము తప్పుడు లొకేషన్కు వచ్చామని గ్రహించేసరికే జరగకూడనంత నష్టం జరిగిపోయింది.
సమయంతో పోరాటం.. చేజారిన అవకాశం
సమయం మించిపోతుండటంతో ఆ నలుగురు అభ్యర్థులు తీవ్ర ఆందోళనతో ముజఫర్నగర్ వైపు పరుగులు తీశారు. స్థానికులను దారి అడుగుతూ, పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఎలాగోలా ముజఫర్నగర్ చేరుకునేసరికి పరీక్షా కేంద్రం గేట్లు మూతపడ్డాయి. పరీక్ష ప్రారంభ ప్రక్రియ ముగిసిపోవడంతో అధికారులు వారిని లోపలికి అనుమతించలేదు. దీనితో రాత్రింబవళ్లు కష్టపడి చదివినా పరీక్ష రాయకుండానే వారు వెనుదిరగాల్సి వచ్చింది.


