న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తదుపరి కార్యాచరణ ఏంటి? భారతీయుల్లో ఉన్న ప్రశ్న ఇది. దీంతో దీనిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన సమాధానం చెబుతూ.. "మా తదుపరి కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాం. ఉద్యమం నిన్ననే ముగిసింది. మాకు కొంత సమయం ఇవ్వండి" అని అన్నారు.
పంజాబ్లో ప్రశ్నపత్రాల లీకేజీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై కూడా అభిజీత్ దీప్కే స్పందించారు. "ఆ అంశాన్ని కూడా ప్రస్తావిస్తాం. ప్రస్తుతం దానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం" అని చెప్పారు.
ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల గురించి దీప్కే మాట్లాడుతూ... "విద్యార్థులపై నమోదైన కేసుల అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఏ విద్యార్థిపైనా కేసులు నమోదు చేయకూడదు" అని స్పష్టం చేశారు.
పంజాబ్ మంత్రిపై ఒత్తిడి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వచ్చాయి. అయితే ఆ డిమాండ్లను బైన్స్ తాజాగా తిరస్కరించారు. ఫార్మసీ నియామక పరీక్ష వివాదంపై స్పందిస్తూ విమర్శకులపై ఆయన మండిపడ్డారు.
బైన్స్ మీడియాతో మాట్లాడుతూ.. "ఇది ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కాదు. భారీ స్థాయిలో కాపీయింగ్ జరిగిన ఘటన. కాపీయింగ్ను పరీక్షా కేంద్రంలోనే గుర్తించి, అందుకు పాల్పడిన విద్యార్థులను అక్కడికక్కడే పట్టుకున్నాం" అని చెప్పారు.
తన రాజీనామా కోరుతున్న వారిపై స్పందిస్తూ, ప్రతిపక్ష నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. "నేను మొదటి నుంచి విద్యార్థులకే అండగా నిలిచాను. నా రాజీనామా వల్ల ఉద్యమానికి ఉపయోగం ఉంటే పదవి వదులుకోవడానికి కూడా సిద్ధమేనని విద్యార్థులకు చెప్పాను" అని బైన్స్ వెల్లడించారు.
"ఆ కాపీయింగ్ కేసు నా శాఖ పరిధిలోనిది కూడా కాదు. అది నా సహచర మంత్రి బాధ్యత. అయినప్పటికీ బాధ్యత నుంచి నేను తప్పించుకోవడం లేదు" అని హర్జోత్ సింగ్ బైన్స్ స్పష్టం చేశారు.


