జైపూర్: దేవాలయాల్లో భక్తులు ఏమేమి సమర్పిస్తారు? కొందరు కొబ్బరికాయ, కొందరు మిఠాయిలు, ఇంకొందరు బంగారం, వెండి సమర్పిస్తారు. కానీ రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో మాత్రం ఓ భక్తుడు ఆస్తిని సమర్పించాడు. ‘‘శ్రీ సావలియా సేఠ్’’ దేవుడి పేరిట 10.25 బీఘాల వ్యవసాయ భూమితో పాటు తన రెండంతస్తుల ఇంటిని కూడా విరాళంగా ఇచ్చాడు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆస్తిని ఆలయం పేరిట అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించాడు.
ఈ ఘటన డూంగర్పూర్ జిల్లా ఆస్పూర్ తహసీల్దార్ పరిధిలోని ఖేడా సామోర్ గ్రామంలో జరిగింది. అక్కడ నివసించే అమర్జీ అనే వృద్ధుడు.. గౌతమ్ పటేల్ కుమారుడు. అమర్జీ గోభక్తుడు. కుటుంబంలో ఆయన ఒక్కరే ఉన్నారు. నివసించడానికి ఆయనకు మరో ఇల్లు ఉంది. అందువల్ల తన రెండో ఆస్తిని భగవంతుడు సావలియా సేఠ్ పాదాల వద్ద సమర్పించాలని నిర్ణయించారు.
అమర్జీ స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి 10.25 బీఘాల వ్యవసాయ భూమితో పాటు రెండంతస్తుల ఇంటిని శ్రీ సావలియాజీ ఆలయ మండలి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే ఆ ఆస్తి అధికారికంగా ఆలయానికి చెందింది.
రిజిస్ట్రేషన్ సమయంలో ఆలయ మండలి పరిపాలనాధికారి రాజేంద్ర సింగ్, ఆస్తుల ఇన్చార్జ్ భేరుగిరి హాజరయ్యారు. అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తైన తర్వాత ఆలయ మండలి అమర్జీని సత్కరించి కృతజ్ఞతలు తెలిపింది.
సావలియా సేఠ్ ఆలయ ప్రత్యేకత ఏంటి?
రాజస్థాన్లోని శ్రీ సావలియాజీ ధామ్ దేశంలోని అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతి నెల హుండీలు తెరిచినప్పుడు కోట్ల రూపాయల నగదుతో పాటు బంగారం, వెండి, ఇతర విలువైన కానుకలు బయటపడుతుంటాయి. అయితే అమర్జీ సమర్పించిన విరాళం ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన నగదు లేదా నగలు కాదు, తన స్థిరాస్తినే భగవంతుడి పేరిట రాసిచ్చాడు.
ఇటీవల మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా సోన్కచ్ నుంచి వచ్చిన ఓ కుటుంబం 11 కిలోల 400 గ్రాముల వెండి కడ్డీలను సమర్పించింది. వాటి విలువ రూ.26 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అంతకుముందు మరో భక్తుడు సుమారు 137 గ్రాముల బంగారు వేణువును సమర్పించాడు. దాని అంచనా విలువ సుమారు రూ.20 లక్షలు.
ఆలయ కమిటీ అధ్యక్షుడు హజారిదాస్ వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘సావలియా సేఠ్పై భక్తుల విశ్వాసం నిరంతరం పెరుగుతోందని చెప్పారు. దేశం నలుమూలల నుంచి భక్తులు తమ భక్తికి అనుగుణంగా కానుకలు తీసుకొస్తున్నారని తెలిపారు. అయితే ఒక భక్తుడు తన భూమి, ఇంటిని భగవంతుడి పేరిట రాసివ్వడం అరుదైన ఘటన అని అన్నారు. కొందరికి ఇది విరాళం కావచ్చు. మరికొందరికి ఇది భక్తి కావచ్చు. ఇంకొందరికి ఇది వ్యక్తిగత నిర్ణయం కావచ్చు. కానీ ప్రతి కోణం వెనుక ఒక ప్రశ్న మాత్రం ఉంది. నిజంగా మనిషి ఏదైనా వస్తువుకు యజమానినా? లేక కొంతకాలం పాటు దానికి కాపలాదారుడా?’’ అని వ్యాఖ్యానించాడు.


