కథానీతి
‘‘నీకు ఈ జ్ఞానాన్ని ఎవరు బోధించారు’’
ఉపకోసల కామలాయనుడు సత్యకామ జాబాలుని ఆశ్రమంలో శిష్యునిగా 12 సంవత్సరాల΄ాటు గురు శుశ్రూష చేస్తూ, యజ్ఞాగ్నులకు శ్రద్ధతో సేవచేసాడు. అతని వినయం, క్రమశిక్షణ, సేవాభావం అందరినీ ఆకట్టుకున్నాయి. ఒకరోజు గురువుగారు ఇతర శిష్యులకు విద్యను బోధించి వారిని యింటికి పంపించేశారు.
ఉపకోసలునికి మాత్రం బ్రహ్మవిద్య బోధించకుండా ప్రయాణమై వెళ్ళిపోయారు. గురుపత్నికి ఇది బాధ కలిగించి గురువుగారితో అంది ‘‘ఉపకోసలుడు ఎన్నో సంవత్సరాలు నిష్ఠగా సేవచేశాడు. అతనికి కూడా జ్ఞానం బోధించండి’’ అంది. కానీ గురువుగారు పట్టించుకోలేదు. ఉపకోసలునికి నిరాశ కలిగినా గురువుగారిపై కోపంగాని, ఆశ్రమాన్ని విడిచి వెళ్ళడంగాని, తన సేవను ఆపడం గాని చేయలేదు. తన మనసును పవిత్రంగా ఉంచుకుంటూ ఉపవాసం చేశాడు. అతని భక్తికి, సహనానికి ముగ్ధులై ఆశ్రమంలోని 3 యజ్ఞాగ్నులు (గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని) అతనితో మాట్లాడి అతనికి బ్రహ్మ తత్వంలోని అనేక రహస్యాలు బోధించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించాయి. (యజ్ఞాగ్నులు ఉపకోసలునితో మాట్లాడినట్టు చెప్పడం ఒక ప్రతీకాత్మక బోధన.)
గురువు గారు తిరిగివచ్చిన తరువాత ఉపకోసలుని ముఖంలో అపూర్వమైన తేజస్సు చూసి ‘‘నీకు ఈ జ్ఞానాన్ని ఎవరు బోధించారు’’ అని అడిగారు. ఉపకోసలుడు జరిగిన విషయాన్ని చెప్పాడు. అప్పుడు గురువుగారు అగ్నులు బోధించిన జ్ఞానాన్ని సంపూర్ణం చేస్తూ బ్రహ్మస్వరూ΄ాన్ని పూర్తిగా ఉపదేశించాడు. ఉపకోసలుని సహనం ఫలించింది. గురుభక్తి వృథాకాలేదు. నిష్కామ సేవ మనసుని శుద్ధిచేసి జ్ఞాన΄ాత్రుని చేసింది. ఓర్పుతో, విశ్వాసంతో, నిష్ఠతో చేసిన ప్రయత్నం ఎప్పటికీ వృథాకాదు. సమయమొచ్చినపుడు అది విజయాన్ని, జ్ఞానాన్ని, అంతరంగ వికాసాన్ని ప్రసాదిస్తుంది. బాహ్య దృష్టితో చూస్తే యజ్ఞాగ్నులు యజ్ఞకుండంలో వెలిగే అగ్నులు. అంతర్గతంగా అవి మనలోని జ్ఞానానికి, శ్రద్ధకు, భక్తికి, ఆత్మ జిజ్ఞాసకు ప్రతీకలు.
– డా. విశ్వేశ్వరవర్మ భూపతిరాజు


