
అన్నంలో విషం కలిపి ఘాతుకం
భర్త అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
నిందితురాలి అరెస్ట్
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): ప్రియుడి మోజులో ఉన్న వివాహిత తన భర్త కుటుంబాన్ని అంతం చేయాలని పన్నాగం పన్నగా అది బెడిసి కొట్టింది. భర్త అప్రమత్తం కావడంతో ఆకుటుంబం బతికి బట్ట కట్టింది. ఈఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా కెరళూరు గ్రామంలో చోటుచేసుకుంది. కెరళూరు గ్రామానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తికి 11 ఏళ్ల క్రితం చైత్ర అనే యువతితో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. అత్తమామలతో కలిసి జీవిస్తున్నారు. మూడేళ్లుగా చైత్ర పునీత్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది.
ఈ విషయం గజేంద్రకు, అత్తమామకు తెలిసింది. పెద్దలు పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. కొన్ని రోజులు దంపతులు అన్యోన్యంగా ఉన్నప్పటికీ చైత్ర మరోసారి శివ అనే మరో యువకుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. ఇక భర్త, అత్తమామలను అడ్డు తొలగించుకోవాలని భావించి భోజనంలో విషం కలిపింది. చైత్ర ప్రవర్తనలో తేడా గమనించిన భర్త ప్రమాదాన్ని పసిగట్టాడు. అన్నంలో విషం కలిపినట్లు తెలుసుకొని బేలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు చైత్రను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.