బెంగళూరులో రద్దీగా ఉన్న రహదారిపై ఓ మహిళా బైకర్ చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రాఫిక్లో ఆటో నడుపుతున్న మరో మహిళను గమనించిన బైకర్ అలీషా అన్సారీ.. ఆమెకు చాక్లెట్ పంపించి, ఆమె శ్రమను అభినందించారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలవచ్చని చెప్పేలా ఈ ఘటన నిలిచింది.
అలీషా తన సామాజిక మాధ్యమ ఖాతాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. భారీ ట్రాఫిక్ మధ్య బైక్పై వెళ్తున్న ఆమెకు సమీపంలో ఓ మహిళ ఆటో నడుపుతూ కనిపించారు. వెంటనే తన బైక్పై ఉన్న బ్యాగ్ నుంచి ఓ చాక్లెట్ను తీసుకున్నారు.
ఆ చాక్లెట్ను నేరుగా ఇవ్వడానికి అవకాశం లేకపోవడంతో పక్కనే ఉన్న ద్విచక్ర వాహనదారుడి సాయాన్ని అలీషా కోరారు. అతను చాక్లెట్ను తీసుకుని ఆటోలో ఉన్న మహిళకు అందించారు. తన చిన్న బహుమతి ఆమెకు చేరిందని నిర్ధారించుకున్న తర్వాత అలీషా బొటనవేలు పైకెత్తి అభినందనలు తెలిపారు.
అనంతరం కెమెరా వైపు తిరిగిన అలీషా.. కష్టమైన పనులను ఎంచుకుని తమ పిల్లలు, కుటుంబాలు, తల్లిదండ్రుల కోసం శ్రమించే మహిళల గురించి మాట్లాడారు. ఈ వీడియోకు “మహిళలైనా, పురుషులైనా.. ప్రతి ఒక్కరి శ్రమ ప్రత్యేకమే” అన్నారు.
సాధారణంగా బెంగళూరు ట్రాఫిక్ అంటే హారన్లు, తొందరపాటు, అసహనం కనిపించే పరిస్థితి. అలాంటి రద్దీలో ఇద్దరు అపరిచిత మహిళల మధ్య జరిగిన ఈ చిన్న సంఘటన నెటిజన్లను ఆకట్టుకుంది. పెద్ద బహుమతి కాకపోయినా, ఎదుటివారి కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించడం ముఖ్యమని పలువురు స్పందించారు. ఈ వీడియోకు వచ్చిన స్పందనలు.. గజిబిజి జీవితంలో చిన్నపాటి దయ, పరస్పర ప్రోత్సాహం కూడా ఇతరులపై సానుకూల ప్రభావం చూపగలదనే విషయాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి.


