Representative image
కర్ణాటకలోని చిక్కబళ్లాపుర్ జిల్లాలో 7వ తరగతి విద్యార్థుల ప్రాథమిక అభ్యసన స్థాయిపై నిర్వహించిన పరీక్షల్లో ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. కొంతమంది విద్యార్థులకు సాధారణ కన్నడ అక్షరాలు రాయడం, కూడికలు, తీసివేతలు చేయడం కూడా కష్టంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో 180 మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.
చిక్కబళ్లాపుర్ నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది 7వ తరగతి విద్యార్థులు సాధారణ గణిత సమస్యలను పరిష్కరించలేకపోవడం, కన్నడ అక్షరాలను రాయలేకపోవడం ఆయన దృష్టికి వచ్చింది. దీనిపై సెప్టెంబర్ 4న విద్యాశాఖ అధికారులకు లేఖ రాసి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆ తర్వాత చిక్కబళ్లాపుర్ తాలూకాలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో 7వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని విద్యా సమన్వయకర్తలు, బ్లాక్ రిసోర్స్ పర్సన్స్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ పరీక్షించారు. ఆశించిన కనీస అభ్యసన స్థాయికి చాలా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారి పేర్లతో పాటు గత తరగతుల్లో వారికి బోధించిన ఉపాధ్యాయుల వివరాలను విద్యాశాఖకు అందించారు.
సెప్టెంబర్ 15న చిక్కబళ్లాపుర్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కార్యాలయం నుంచి ఉపాధ్యాయులకు నోటీసులు జారీ అయ్యాయి. విద్యార్థులు ఆశించిన ప్రాథమిక అభ్యసన స్థాయిని ఎందుకు చేరుకోలేకపోయారో వివరణ ఇవ్వాలని అందులో కోరారు. నోటీసు అందుకున్న మూడు రోజుల్లో ఆధారాలతో కూడిన లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. సమాధానాలను పరిశీలించిన తర్వాత నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రభుత్వం విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచేందుకు పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, నిర్ణీత సమయంలో అవసరమైన విద్యను అందించడంలో విఫలమైతే ఆ కార్యక్రమాల లక్ష్యాలు దెబ్బతింటాయని విద్యాశాఖ నోటీసులో పేర్కొంది. ఉపాధ్యాయుల వివరణల పరిశీలన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.


