అనైతిక బంధాలు, కాపురాల్లో కోపావేశాలకు విలువైన ప్రాణాలు బలవుతున్నాయి. దారితప్పి చివరకు రక్తపాతంతో ముగుస్తున్నాయి. ఫలితంగా ఎన్నో కుటుంబాలకు కన్నీరే మిగులుతోంది. ఈ పెడపోకడలు సామాజిక సమస్యగా పరిణమించాయి.
కర్ణాటక: ముగ్గురు పిల్లల తల్లిని ఆమె ప్రియుడే గొంతుకోసి హతమార్చిన సంఘటన దావణగెరె సిటీ శేఖరప్ప నగరలో జరిగింది. నాగరత్న(45)ను నాగరాజు (36) హత్య చేశాడు. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగరాజుతో అక్రమ సంబంధం సాగుతోంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా చొరబడ్డ నాగరాజు కత్తితో హత్య చేశాడు. నాగరత్న ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని పరారవుతున్న నాగరాజును పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.

ప్రియురాలి చేతిలో ప్రియుడు హతం
దొడ్డబళ్లాపురం: ప్రియురాలి చేతిలో ప్రియుడు హత్యకు గురైన సంఘటన దావణగెరెలోని కేశవమూర్తి కాలనీలో జరిగింది. మంజప్ప (40)ను, ప్రేయసి షబీనా (38) చీరతో గొంతు బిగించి ప్రాణాలు తీసింది. మంజప్పకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా విడాకులు తీసుకుని షబీనాతో జీవిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇద్దరూ గొడవకు దిగారు. దీంతో ఆమె ఏకంగా హత్య చేసింది. పోలీసులు నిందితురాలిని నిర్బంధించారు.

భార్యను కడతేర్చి.. తానూ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పట్టణంలోని ఒక లాడ్జిలో భార్యను హత్య చేసి పరారైన కసాయి భర్త చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. దొడ్డ రూరల్ ఠాణా దగ్గర లాడ్జిలో భార్య విద్య (21)ను ఆమె ఐడెంటిటీ కార్డ్ ట్యాగ్తో గొంతు బిగించి హత్య చేసి పరారైన భర్త ఆనంద్ నాలుగు రోజుల నుంచి జాడ లేడు. సొంతూరైన గౌరిబిదనూరు తాలూకా ముదుగెరె చెరువు వద్ద మద్యం తాగి చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. బైక్, 2 మొబైళ్లు తదితరాలు అక్కడ ఉన్నాయి. గౌరిబిదనూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసింది
బనశంకరి: కుటుంబ కలహాలతో కోపోద్రిక్తురాలైన మహిళ ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసిన ఘటన మంగళూరు వద్ద ఉప్పినంగడి పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ఒకరు మృతిచెందగా మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. సినాన్, నూరున్నీషా దంపతుల మధ్య ఫోన్కాల్ గురించి రగడ మొదలైంది. నూరున్నీషా కోపం పట్టలేక తన మూడేళ్ల కుమారుడు, భర్త చెల్లెలి మూడేళ్లు కొడుకుని తీసుకెళ్లి ఇంటి వద్దనున్న బావిలోకి పడేసింది. స్థానికులు చూసి పిల్లలను బయటకు తీశారు. భర్త చెల్లి కుమారుడు చనిపోగా, సొంత కొడుకు తీవ్ర అస్వస్థత పాలయ్యాడు. అతనిని మంగళూరు ఆస్పత్రిలో చేరి్పంచారు. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.


