కర్ణాటకలో సింధనూరు వద్ద ఘోరం
రాయచూరు రూరల్: కర్ణాటకలో అత్యంత హృదయ విదారకమైన ఘోరం వెలుగుచూసింది. పొలంలో ఓ వివాహిత హత్యకు గురికాగా మృతదేహంపై చిన్నారి విలపిస్తోంది. తన తల్లి ఎందుకు అలా పడి ఉందో తెలియక, పాల కోసం రోదిస్తూ ఉంది. రాయచూరు జిల్లా సింధనూరు తాలూకాలో ఆర్హెచ్ క్యాంపు సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని స్నేహ అమిత్ (26)గా గుర్తించారు. ఏడాదిన్నర కుమార్తె మేఘనను మృతదేహంపై పడుకోబెట్టి హంతకులు పరారయ్యారు. బాలిక ఏడుపుతో హత్య వెలుగులోకి వచ్చింది.

స్నేహ తల, గొంతులో కత్తితో పొడిచి చంపినట్లు ఆనవాళ్లున్నాయి. సింధనూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ సీఐ వినాయక్, డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్ ఘటనాస్థలిని పరిశీలించారు. స్నేహకు అమిత్ అనే యువకుడితో 3 ఏళ్ల కిందట పెళ్లయినట్లు తెలుస్తోంది. అమిత్తో పాటు ఆమె స్నేహితుడు శుభం అనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరు ఉత్తరాది నుంచి కూలి పనుల కోసం వలస వచ్చారని సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


