వైషు అమ్మ–హరిబాబు కేసులో ఇవేం ట్విస్టులు! | Vaishnavi Husband Haribabu Case: Bigg Boss Style Requests Go Viral | Sakshi
Sakshi News home page

వైషు అమ్మ–హరిబాబు కేసులో ఇవేం ట్విస్టులు!

Sep 18 2026 8:19 AM | Updated on Sep 18 2026 9:00 AM

Vaishnavi Husband Haribabu Case: Bigg Boss Style Requests Go Viral

సాక్షి, నిజామాబాద్‌: కేవలం పది సెకండ్లలో.. 9 కత్తిపోట్లు. కళ్ల ముందే కొడుకు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ దారుణ హత్యకు గురయ్యాడు. ఆ ఘటన తాలూకు దృశ్యాలు కళ్లముందు మెదులుతుండటం.. హరిబాబు తల్లి లక్ష్మిని షాక్‌కి గురి చేసింది. యూట్యూబర్‌ వైష్ణవి హత్య కేసు ప్రధాన నిందితుడు, ఆమె భర్త హరిబాబు కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బిగ్‌బాస్‌ తరహా రిక్వెస్టులు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. 

హరిబాబు గురువారం నిజామాబాద్‌లోని ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు అతడిపై పదునైన ఆయుధంతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సెకన్ల వ్యవధిలోనే పదే పదే పొడిచేశారు. తీవ్ర గాయాలతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.   ‘హరిబాబును చంపినట్లే.. నన్నూ చంపేస్తారేమో. నన్ను కాపాడండయ్యా’ అంటూ లక్ష్మి ప్రాణభయంతో వణికిపోతూ పోలీసులను ప్రాధేయపడుతోంది. 

వైషు అమ్మ హత్యకు కారకుడంటూ..
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్‌కు చెందిన వైష్ణవి ‘వైషు అమ్మ’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహించేది. ఈ ఏడాది మార్చి 17న ఆమె తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందింది. అప్పటికి ఆమె నాలుగు నెలల గర్భిణి. ఈ కేసులో హరిబాబును పోలీసులు ప్రధాన నిందితుడిగా అరెస్టు చేశారు. వైష్ణవి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో.. అదనపు కట్నం వేధింపుల ఆరోపణలపై అతడి తల్లి లక్ష్మి, సోదరులు ఆనంద్‌, అశోక్‌లపైనా కేసులు నమోదయ్యాయి.

బెయిల్‌పై బయటకు వచ్చి..
వైష్ణవి హత్య కేసులో కొంతకాలం జైలులో ఉన్న హరిబాబు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత ప్రాణభయంతో.. తల్లి లక్ష్మితో కలిసి నిజామాబాద్‌కు మకాం మార్చాడు. గురువారం ఆర్‌ఆర్‌ చౌరస్తా వద్ద ఉన్న సమయంలో కారులో వచ్చిన వ్యక్తి అతడిపై దాడి చేసి హత్య చేశాడు. అయితే హరిబాబు హత్యకు పాత కక్షలు కారణమా? లేదంటే వైష్ణవి హత్య కేసుతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

కళ్ల ముందే కొడుకు హత్య.. తల్లికి షాక్‌
కొడుకు హత్యతో లక్ష్మి తీవ్ర షాక్‌కు గురైంది. ఇప్పటికే వైష్ణవి హత్య కేసు కారణంగా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉండగా.. ఇప్పుడు హరిబాబు కూడా హత్యకు గురికావడంతో ఆమె మరింత భయాందోళనకు గురవుతోంది. తన కొడుకుకు జరిగినట్లే తనకూ ఏదైనా ప్రమాదం జరగొచ్చనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మరో హరిబాబు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. 

పోలీసుల అదుపులో సంతోష్‌!
మరోవైపు హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైష్ణవి సోదరుడు సంతోష్‌, హరిబాబును తానే హత్య చేసినట్లు చెబుతూ కోరుట్ల పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతకు ముందు ఓ సెల్ఫ వీడియోలో షాకింగ్‌ కామెంట్లు చేశాడు.  సంతోష్‌ ఓ వీడియో విడుదల చేశాడు. ‘‘మా చెల్లికి జరిగినట్లు ఎవరికి జరగకూడదని నేను అతన్ని హత్య చేశాను. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చాలా రోజులు ఎదురు చూశాను.. వాళ్లు న్యాయం చేయలేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది. నాకు పెళ్లాం, పిల్లలు ఉన్నారు. మీ కాళ్లు మొక్కుతా, మీకు దండం పెడుతా నాకు సపోర్ట్ చేసి నన్ను త్వరగా బయటికి తీసుకురండి.  నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూడండి’’ అంటూ వీడియోలో చెప్పాడు. అదుపులోకి  తీసుకున్న కోరుట్ల పోలీసులు.. అతన్ని నిజామాబాద్‌ పోలీసులకు అప్పగించారు.

సంతోష్‌ భార్య కూడా.. 
మా ఆయన హత్య చేయడం కరెక్టా కాదా మీరే చెప్పాలి.. అంటూ ఇటు సంతోష్‌ భార్య కూడా గత రాత్రి ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘నన్ను నా ఇద్దరు పిల్లలని వదిలి నా భర్త జైలుకు వెళ్ళాడని బాధగా ఉంది. కానీ వైష్ణవిని చంపినవాడు చనిపోయాడని ఆనందంగా కూడా ఉంది. నా భర్త బయటికి రావాలంటే మీరందరూ సపోర్ట్ చేయాలి అంటూ సంతోష్‌ భార్య ఆ వీడియోలో విజ్ఞప్తి చేసింది. 

 VIDEO CREDITS: Telugu Scribe

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement