ఇటీవల కేంద్రప్రభుత్వం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆధారాలు సరిపోలడం లేదంటూ ప్రముఖులకు సైతం ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వడం వారు మాకే నోటిసులిస్తారా అంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం ఇలా ఈ అంశం వివాదాస్పదమవుతూ వచ్చింది. అయితే ఈ సారి ఆ జాబితాలో ఏకంగా భారత విదేశాంగ శాఖ మంత్రి చేరారు. గతంలో ఇచ్చిన వివరాలతో ప్రస్తుత వివరాలు సరిపోవడం లేదంటూ ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీలో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో పలువురు ప్రముఖులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీత ద్వివేది, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబ సభ్యులు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రస్తుత ఓటరు వివరాలను 2002లో జరిగిన గత సవరణలోని రికార్డులతో అనుసంధానం చేయలేకపోవడం లేదా పేర్లు, కుటుంబ వివరాల్లో తేడాలు ఉండటమే ఇందుకు కారణాలుగా ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.
జైశంకర్ దంపతులు, ప్రవీణ్ సూద్ కుటుంబ సభ్యులు, జనరల్ ఉపేంద్ర ద్వివేది దంపతులను “అన్మ్యాప్డ్ విత్ లాస్ట్ SIR” విభాగంలో చేర్చారు. అంటే ప్రస్తుత ఓటరు జాబితాలోని వారి వివరాలను గత SIR సమయంలో రూపొందించిన ఓటరు జాబితాతో అనుసంధానం చేయలేకపోయినట్లు అర్థం. వీరంతా న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే నోటీసు అందుకోవడం వల్ల ఓటు హక్కు రద్దయిందని లేదా ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారని అర్థం కాదని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి స్పష్టం చేశారు.
మాజీ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు వచ్చాయి. సిసోడియా భార్య సీమా సిసోడియా వివరాల్లో పేరుకు సంబంధించిన తేడాను, కుమారుడు మీర్ సిసోడియా రికార్డులో తల్లిదండ్రుల పేరుకు సంబంధించిన తేడాను అధికారులు గుర్తించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజనా దేశాయ్, ఆమె భర్త ప్రకాశ్ దేశాయ్, కుమారుడు మైక్ దేశాయ్, కోడలు సాక్షి దేశాయ్ పేర్లు కూడా “అన్మ్యాప్డ్” విభాగంలో ఉన్నాయి. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ కుటుంబ సభ్యులకూ వివిధ కారణాలతో నోటీసులు జారీ అయ్యాయి.
పలువురు సీనియర్ అధికారులు కూడా SIR నోటీసులు అందుకున్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్, ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తదితరులను “అన్మ్యాప్డ్ విత్ లాస్ట్ SIR” కేటగిరీలో చేర్చారు. మరికొందరు అధికారుల రికార్డుల్లో పేరు లేదా కుటుంబ వివరాలకు సంబంధించిన తేడాలను అధికారులు గుర్తించారు.
ఎన్నికల సంఘం ప్రకారం, నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత ఎన్నికల నమోదు అధికారికి తమ వివరణతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన అనంతరం అధికారి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఎవరి పేరునూ విచారణకు అవకాశం ఇవ్వకుండా తొలగించబోమని, నిర్ణయం కారణాలతో కూడినదిగా మరియు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేలా ఉంటుందని ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. నోటీసుల పరిష్కార ప్రక్రియను అక్టోబర్ 29లోగా పూర్తి చేసి, తుది ఓటరు జాబితాను నవంబర్ 4న ప్రచురించనున్నట్లు తెలిపారు.


