
ఐపీఎల్ 2025లో టైటిల్ దక్కించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవంలో తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బెంగళూరులోని విధాన సౌధా, చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషాద సమయంలోఅనేక హృదయవిదారక దృశ్యాలు, కథనాలు అందర్నీ కలచి వేస్తున్నాయి. ముఖ్యంగా క్రికెట్ మీద పిచ్చితో, తమ అభిమాన క్రికెటర్లను చూడాలన్న ఆశతో వచ్చిన యువకులు ప్రాణాలు కోల్పోవడం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురించేసింది. ఇది ఇలా ఉంటే "పోస్ట్మార్టం చేయకుండానే తన కొడుకు మృతదేహాన్ని ఇవ్వాలని బిడ్డను కోల్పోయిన తల్లి వేడుకుంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ (DK Shivakumar) భావోద్వేగానికి లోనయ్యారు. తల్లి బాధను అర్థం చేసుకోగలం. కానీ అది చట్టపరమైన ప్రక్రియ అంటూ శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు.
నిన్న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తండ్రిని ఓదార్చడం ఎవ్వరి తరమూ కాలేదు. ‘‘కనీసం నా కొడుకు మృతదేహాన్ని నాకు ఇవ్వండి. పోస్ట్మార్టం చేయవద్దు, ముక్కలుగా కోయవద్దు..’’ అంటూ అధికారులను వేడుకున్నాడు. తనకు తెలియకుండానే వచ్చాడు..ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవ్వరొచ్చినా నా బిడ్డను తీసుకురాలేరు అంటూ కన్నీరుమున్నీరయ్యాడు
కేంద్ర మంత్రి శోభా కరండ్లజే శివకుమార్ వెంటనే రాజీనామా చేయాలని తొక్కిసలాటపై దర్యాప్తు చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శివకుమార్ స్పందించారు. ఈ విషాదంపై బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. కాగా సంఘటన జరిగిన వెంటనే డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పారు. 35వేల మంది కూర్చునే సామర్థ్యం ఉన్న స్టేడియంలో భారీ జనసమూహం సరిపోలేదన్నారు. మరోవైపు ఊహించని దానికంటే సుమారు 8 లక్షల మంది జనం రావడంతోనే ప్రమాదం జరిగిందని కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే ఈ విషయంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించినట్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ప్రకటించారు.