విశాఖ రౌత్
దాదర్: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) మాజీ మేయర్, శివసేన(యూబీటీ) కార్పొరేటర్ విశాఖ రౌత్ పదవి రద్దయింది. దీంతో ఉద్ధవ్ వర్గానికి గట్టి దెబ్బ తగిలినట్టైంది. ఎన్నికల సమయంలో దరఖాస్తు ఫారంతోపాటు ఆమె సమర్పించిన కులధ్రువీకరణ పత్రం తప్పుడుదని తేలడంతో ఆమె కార్పొరేటర్ పదవి రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేగాకుండా వచ్చే ఆరేళ్ల వరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకూడదని స్పష్టం చేసింది.
పాల్ఘర్ జిల్లా కులధ్రువీకరణ పత్రాల పరిశీలన కమిటీ విశాఖ రౌత్పై అనర్హత వేటు వేయాలని బీఎంసీ కమిషనర్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ లేఖను వ్యతిరేకిస్తూ విశాఖ రౌత్ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఆమెకు ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నగరాభివృద్ధి శాఖ ఆమె కార్పొరేటర్ పదవి రద్దుచేస్తున్నట్లు ఉత్వర్వులు జారీచేసింది. ఈ ఏడాది ఆగస్టు 20 నుంచి ఆరేళ్లపాటు నిషేధం అమల్లో ఉంటుందని ప్రకటించింది.
శివసేన యూబీటీకి చెందిన విశాఖ రౌత్ (Vishakha Raut) ఈ ఏడాది జనవరిలో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో ఓబీసీ మహిళకు రిజర్వు అయిన దాదర్లోని వార్డు నంబరు 191 నుంచి పోటీచేసి గెలిచారు. ఆమెకు 13,236 ఓట్లురాగా, ప్రత్యర్థిగా బరిలోకి దిగిన శివసేన ఏక్నాథ్ శిందే వర్గానికి చెందిన ప్రియ సర్వన్కర్కు 13,039 వచ్చాయి. సిద్ధివినాయక్ మందిరం, శివాజీపార్క్, పశ్చిమ దాదర్ పరిసరాలు ఈ వార్డుపరిధిలోకి వస్తాయి. కానీ విశాఖ రౌత్ సమర్పించిన కులధ్రువీకరణ పత్రం తప్పుడుదని ప్రత్యర్ధిగా బరిలో నిలిచిన ప్రియ సర్వాన్కర్ ఆరోపించారు. ఆ పత్రాన్ని పునఃపరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ఈసీదే తుది నిర్ణయం
విచారణ జరిపిన పాల్ఘర్ జిల్లా కులధ్రువీకరణ పత్రాల పరిశీలన కమిటీ.. విశాఖ రౌత్ సమర్పించిన పత్రం నకిలీదని తేల్చింది. దీంతో బీఎంసీ నియమం 1888 లోని సెక్షన్ 16 ప్రకారం ఆమెను కార్పొరేటర్ పదవికి అనర్హురాలిగా ప్రకటించింది. కాగా, 191 వార్డు కార్పొరేటర్ పదవి ఖాళీ కావడంతో రెండో స్ధానంలో నిలిచిన ప్రియ సార్వన్కర్కు ఈ పదవిని కట్టబెడతారా..? లేదా మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా..? అనేది త్వరలో ఎన్నికల సంఘం ప్రకటించనుంది. కాగా, నకిలీ కులధ్రువీకరణ పత్రాలు సమర్పించారన్న ఆరోపణలతో జూన్, జూలై మధ్య కాలంలో ప్రతిపక్షానికి చెందిన కనీసం నలుగురు కార్పొరేటర్లపై అనర్హత వేటు పడింది.
ఇదీ చదవండి: లోహన్గఢ్.. కేతన్ హత్య కేసులో మరో ట్విస్ట్


