
న్యూఢిల్లీ: దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పడు పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుని ఎంపికపై దృష్టి సారించింది. దీనిపై పార్టీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ, అధ్యక్షుని ఎంపిక విషయమై అంతర్గత చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వచ్చే జూన్ మధ్య నాటికి దీనిపై అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుందని బీజేపీ వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం బీజేపీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసింది. తదుపరి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే ముందు పార్టీ రాజ్యాంగం ప్రకారం అవసరమైన ముందస్తు షరతును ఇప్పటికే నెరవేర్చింది. ఉత్తరప్రదేశ్లో ఇటీవల 70 మంది జిల్లా అధ్యక్షులను ప్రకటించిన తర్వాత కేంద్ర నాయకత్వం త్వరలోనే బీజేపీ చీఫ్ పదవిపై నిర్ణయం తీసుకోవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో చోటుచేసుకున్న ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ ప్రక్రియ కొంతకాలం ఆలస్యం జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి రేసులో ముఖ్యంగా ముగ్గురు నేతలు కనిపిస్తున్నారు. వారిలో ఒడిశాకు చెందిన కీలక ఓబీసీ నేత, కేంద్ర నాయకత్వానికి సన్ని హితునిగా పేరుగాంచిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకరు. పార్టీ అధ్యక్ష పదవికి రేసులో ముందుగా ఈయన పేరు వినిపిస్తోంది. తరువాత శివరాజ్ సింగ్ చౌహాన్ మరో పోటీదారుగా నిలిచారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన, ప్రజా నాయకునిగా పేరుగాంచారు.
తదుపరి నేత విషయానికి వస్తే ఇటీవలే హర్యానా ముఖ్యమంత్రి పాత్ర నుండి కేంద్ర మంత్రివర్గానికి వెళ్లిన మనోహర్ లాల్ ఖట్టర్. ఈయనకు అపారమైన పరిపాలనా అనుభవం ఉందంటారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఈయన పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తోందని సమాచారం. అయితే ప్రాంతీయ ప్రాతినిధ్యం, కుల సమీకరణల ఆధారంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2020 జనవరి నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీని నడిపించేందుకు ఆయన పదవీకాలాన్ని పొడిగించారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ప్రసంగంపై పాక్ ఏమన్నదంటే..