
న్యూఢిల్లీ: మొన్నటి ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన అనంతరం పాకిస్తాన్- భారత్ల మధ్య వైరం మరింతగా పెరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిలో ఇస్లామాబాద్ ప్రమేయంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై పాకిస్తాన్ ప్రతిస్పందించింది. భారత ప్రధాని వ్యాఖ్యలు తమను తీవ్ర నిరాశకు గురి చేశాయని పేర్కొంది.
జమ్ముకశ్మీర్లోని కత్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడి అని పేర్కొంటూ, భారతదేశంలో అల్లర్లను ప్రేరేపించడమే లక్ష్యంగా ఇది జరిగిందన్నారు. కష్టపడి పనిచేసే కశ్మీర్ ప్రజల జీవనోపాధిని దెబ్బతీయడమే పాకిస్తాన్ ఉద్దేశ్యమని, అందుకే పర్యాటకులను లక్ష్యంగా చేసుకుందని ప్రధాని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి స్పందిస్తూ, అవి నిరాధారమైనవని, తప్పుదారి పట్టించే వ్యాఖ్యలని, వాటిని తాము తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రధాని .. పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉందనేలా ఒక్క విశ్వసనీయమైన ఆధారాన్ని కూడా చూపకుండా తమపై ఆరోపణలు గుప్పించడంపై తాము నిరాశ చెందామన్నారు. కాగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో జమ్ముకశ్మీర్ యువత ఇప్పుడు ఉగ్రవాదానికి బలమైన ప్రతిస్పందన ఇవ్వాలని నిశ్చయించుకున్నదని అన్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ సమీపంలోని బైసరన్ వద్ద ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మంది ప్రాణాలను బలిగొన్నారు. దీనికి ప్రతిస్పందనగా భారత్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో వందమందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మే 10న పాకిస్తాన్ సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ భారత్ను సంప్రదించి, సైనిక చర్యలను నిలిపివేయాలని కోరారు. దీనిపై ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చి, యద్దాన్ని ముగించాయి.
ఇది కూడా చదవండి: మస్క్.. ‘ది అమెరికా పార్టీ’కి 80 శాతం మద్దతు