భువనేశ్వర్: ఒడిశాలో విధుల్లో ఉండగా కాలిపై విషపూరిత కామన్ క్రైట్ పాము కాటు వేయడంతో ఓ వాచ్మన్ ఆ పామును పాలిథిన్ సంచిలో పెట్టుకుని సైకిల్పై ఆస్పత్రికి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. మయూర్భంజ్ జిల్లాకు చెందిన మోచిరామ్ టుడు ఆ తర్వాత అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో తదుపరి చికిత్స కోసం బరిపడాలోని ఆస్పత్రికి తరలించారు.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఉడాలా పట్టణంలోని వార్డు నంబర్ 10లోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అసిస్టెంట్ ఇంజినీర్ కార్యాలయంలో టుడు విధుల్లో ఉండగా పాము కాటేసింది. తొలుత తనను కామన్ క్రైట్ పాము కరిచిందని టుడుకు తెలియలేదు. ఆ పామును కూడా గుర్తించలేకపోయారు. ఈ ఘటన తీవ్రతను అర్థం చేసుకున్న తర్వాత పామును పట్టుకుని చంపి పాలిథిన్ సంచిలో పెట్టుకున్నారు. అనంతరం చనిపోయిన పామును వెంట తీసుకుని సైకిల్పై ఉడాలా సబ్ డివిజనల్ ఆస్పత్రికి వెళ్లారు.
ఆస్పత్రిలోని వైద్యులు ఆ పాము కామన్ క్రైట్ అని గుర్తించి టుడుకు వెంటనే చికిత్స ప్రారంభించారు. రాత్రి సమయంలో ఆయన పరిస్థితి క్షీణించడంతో తదుపరి చికిత్స కోసం బరిపడాలోని పీఆర్ఎం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించాలని వైద్యులు సూచించారు. “ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించాం. అయితే రాత్రి సమయంలో ఆయన పరిస్థితి క్షీణించింది” అని ఉడాలా సబ్ డివిజనల్ ఆస్పత్రి ఇన్చార్జ్ అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ డి. జెనా తెలిపారు. టుడు ప్రస్తుతం బరిపడా ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
పాముకాట్లు అధికం
ఒడిశాలో విపత్తు సంబంధిత మరణాలకు పాముకాటు ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉంది. నీళ్లలో మునిగి చనిపోతున్న వారి సంఖ్య తర్వాత పాముకాటు మరణాల్లో రెండో స్థానంలో ఉంది. 2023-24లో రాష్ట్రంలో పాముకాటుతో 1,150 మంది మృతి చెందారు. 2024-25లో 709 మరణాలు నమోదయ్యాయి. తీర ప్రాంత జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది.
పాముకాటు మరణాలను తగ్గించేందుకు ఒడిశా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టాలని యోచిస్తోంది. గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, పాములు, ఎలుకల సంచారం తగ్గేలా ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.
రాత్రివేళ బయటకు వెళ్లే ప్రజల కోసం గమ్బూట్లు, టార్చ్ల వంటి రక్షణ పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులు భావిస్తున్నారు. పాముకాటును తొలిదశలో గుర్తించడం, ప్రాథమికంగా స్పందించడం గురించి ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, నర్సులు, ఉపాధ్యాయులు సహా క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించారు.
పాముకాటుకు ఇచ్చే యాంటీ స్నేక్ వెనం అందించడంలో వైద్యుల సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలు, బ్లాక్ స్థాయిల్లో పాముల రక్షణ బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ స్నేక్ వెనం నిల్వలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని యోచిస్తోంది.
అధిక ప్రమాదం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక పాముకాటు చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. పాము కాటేసిన తర్వాత కీలకమైన సమయంలో చికిత్స ఆలస్యం కాకుండా 24 గంటల అత్యవసర రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కూడా ప్రతిపాదించారు.


