బెంగళూరు: నగరంలో రోడ్డుపై వెళ్తున్న బైకర్పై ఒక్కసారిగా విరిగిపడిన చెట్టు కొమ్మ అతడిని ప్రాణాపాయ స్థితికి నెట్టింది. తలపై తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన బాధితుడికి అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించగా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. రాజాజీనగర్ ప్రాంతంలోని రామ్ మందిర్ రోడ్డులో శనివారం జరిగిన ప్రమాదంలో 52 ఏళ్ల ద్విచక్రవాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు సతీష్ తన ఆఫీస్కు వెళ్తుండగా ఒక్కసారిగా ఎండిపోయిన చెట్టు కొమ్మ విరిగి అతడి తలపై పడింది.
సతీష్ హెల్మెట్ ధరించలేదు. చెట్టు కొమ్మ బలంగా తగలడంతో అతడు బైక్పై నుంచి రోడ్డుపై పడిపోవడం సీసీటీవీలో దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం యశ్వంత్పూర్లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సతీష్కు శస్త్రచికిత్స నిర్వహించారు.
తలకు తీవ్ర గాయం కారణంగా ఆయన తొలుత కోమాలోకి వెళ్లినప్పటికీ.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతూ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో నగరాల్లో పాత, ఎండిపోయిన చెట్ల నిర్వహణపై అధికారుల నిర్లక్ష్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అలాగే ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం మరోసారి గుర్తు చేసింది.


