టమాటాకు ‘సెంచరీ’ ఫీవర్.. రంగంలోకి ప్రభుత్వం! | Tomato Prices Surge Across India, Centre Plans Subsidised Sales To Ease Burden On Consumers, Check More Details Inside | Sakshi
Sakshi News home page

టమాటాకు ‘సెంచరీ’ ఫీవర్.. రంగంలోకి ప్రభుత్వం!

Jun 25 2026 9:29 AM | Updated on Jun 25 2026 10:12 AM

Tomato Prices Soar Past 70kg Government to Steps in with Subsidised Sales

న్యూఢిల్లీ: కూరల్లో రారాజైన టమాటా ధరలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కేజీ ధర రూ.70 మార్కును దాటేసి, కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో రూ.95 వరకు పలకడంతో సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. ఈ నేపథ్యంలో, పెరుగుతున్న ధరలకు అడ్డుకట్ట వేసేందుకు, వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి నేరుగా రంగ ప్రవేశం చేయబోతోంది.

రేట్లు తగ్గించేందుకు కేంద్రం స్కెచ్
దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిపోతుండటంతో వినియోగదారుల వ్యవహారాల శాఖ రంగంలోకి దిగింది. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సీసీఎఫ్‌), ఇతర సహకార నెట్‌వర్క్‌ల ద్వారా కేజీ రూ.35 నుండి రూ.45 సబ్సిడీ ధరకే టమాటాలను విక్రయించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సబ్సిడీ విక్రయాలు మొదట ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై నగరాల్లో ప్రారంభించి, ఆ తర్వాత దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.

పెరిగిన ధరలకు కారణాలివే..
గత ఏడాది ఇదే సమయంలో దేశంలో సగటున కేజీ టమాటా ధర రూ.34.43 ఉండగా, ఇప్పుడు అది ఏకంగా రెట్టింపైంది. దేశంలోనే అతిపెద్ద టమాటా ఉత్పత్తి కేంద్రమైన కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో, ఇతర ప్రధాన రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం వల్ల పంట నాణ్యత దెబ్బతింది. మార్కెట్‌కు వచ్చే సరుకు (సప్లై) తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడంతో బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లలో సైతం ధరలు మండిపోతున్నాయి.

పాత రోజులు గుర్తొస్తున్నాయా?
టమాటా ధరల పెరుగుదల వల్ల మే నెలలో దేశీయ రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం 4.78 శాతానికి పెరిగింది. గతంలో 2023 జూలై-ఆగస్టు సమయంలో కూడా భారీ వర్షాల కారణంగా కొన్ని నగరాల్లో టమాటా ధర ఏకంగా రూ.200 దాటిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా ప్రభుత్వం ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకుని ధరలను నియంత్రించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశంలో 2.146 కోట్ల టన్నుల టమాటా ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినప్పటికీ, తాత్కాలిక సరఫరా లోపం వల్లే ఈ ధరల పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ఒబామా జోస్యం: ‘ట్రంప్‌’ స్థానంలో మహిళా అధ్యక్షురాలు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement