బారామతి: మహారాష్ట్ర పూణే జిల్లా బారామతి విమానాశ్రయంలో ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది. ఆదివారం మధ్యాహ్నం 12:35 గంటల ప్రాంతంలో రన్వేకు కొద్ది దూరంలోనే ఈ విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది. ఈ ప్రమాదంలో విమానం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గత జనవరిలోఅప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఇదే విమానాశ్రయం వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాద ఘటన జరిగిన సుమారు ఏడు నెలల వ్యవధిలోనే ఇక్కడ రెండో ప్రమాదం జరగడం గమనార్హం.
ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, విమానం చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం తలెత్తింది. క్రాష్ ల్యాండింగ్ అవుతున్న క్రమంలో విమానం భాగం సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, ఆపై నేలను తాకింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న ట్రైనీ పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఏడాది జనవరి 28న ముంబై నుండి బారామతి వస్తున్న ఓ సంస్థ చార్టర్డ్ విమానం దట్టమైన పొగమంచు కారణంగా రన్వేపై ల్యాండ్ అవ్వడానికి రెండోసారి ప్రయత్నిస్తూ కుప్పకూలిపోయింది. ఆ ప్రమాదంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ (66), ఆయన పీఎస్ఓ, అటెండెంట్తో పాటు ప్లైట్ కెప్టెన్ సుమిత్ కపూర్, కోపైలెట్ శంభవి పాఠక్లతో కలిపి మొత్తం ఐదుగురు మరణించారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్న ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వచ్చే ఏడాది జనవరి నాటికి తన తుది నివేదికను సమర్పించనుంది.


