టీఎంసీలో మరో ట్విస్ట్‌.. అందుకు ఎమ్మెల్యేల నో! | TMC Twist: Rebel MLAs Reject MPs Path | Sakshi
Sakshi News home page

టీఎంసీలో మరో ట్విస్ట్‌.. అందుకు ఎమ్మెల్యేల నో!

Jun 16 2026 7:17 AM | Updated on Jun 16 2026 12:23 PM

TMC Twist: Rebel MLAs Reject MPs Path

పశ్చిమ బెంగాల్ రాజకీయాలు టీవీ సీరియల్‌లా సాగిపోతూ.. వెబ్‌ సిరీస్‌ల పూటకో ట్విస్టులను పంచుతున్నాయి. ప్రతిపక్ష తృమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అంతర్గత సంక్షోభం..  రోజురోజుకూ మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ఆ పార్టీ మెజారిటీ ఎంపీలు సరికొత్త రాజకీయ మార్గాన్ని ఎంచుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో ఇప్పుడు మెజారిటీ సంఖ్యలో ఉన్నామని చెప్పుకుంటున్న రెబల్‌ ఎమ్మెల్యేల వర్గ వైఖరి ఏమిటన్న ఆసక్తి నెలకొంది.

టీఎంసీకి చెందిన 20 మంది రెబల్‌‌ ఎంపీలు.. ఓ అనామక పార్టీ అయిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ)లో విలీనం అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ‘ప్రత్యేక సిట్టింగ్‌’ కేటాయించమని లేఖ కూడా అందజేసింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌కు బయటి నుంచి మద్దతు ఇస్తామని ప్రకటించింది కూడా. ఈ పరిణామం మమతా బెనర్జీకి పెద్ద షాక్‌ అనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో టీఎంసీ ఎమ్మెల్యేల తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. 

టీఎంసీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు(64 మంది) తనకే ఉందని.. తనకు తానుగా ప్రతిపక్ష నేతగా ప్రకటించుకున్నారు రితబ్రతా బెనర్జీ. రెబల్‌ ఎంపీల దారిలోనే పయనిస్తారా? అనే ప్రశ్నకు ఆయన నుంచి ఆసక్తికరమైన సమాధానమే వచ్చింది. ఎమ్మెల్యేల వర్గం మాత్రం ఆ నిర్ణయాన్ని అనుసరించబోదని రితబ్రతా బెనర్జీ స్పష్టం చేశారు. 

తమ వర్గంలో అలాంటి ప్రతిపాదన ఎప్పుడూ చర్చకు రాలేదని, ఎన్‌సీపీఐలో చేరే ఆలోచన కూడా తమకు లేదని తెలిపారాయన. టీఎంసీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేలలో మెజారిటీ ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని చెబుతున్న రితబ్రతా బెనర్జీ.. ఎంపీల విలీన నిర్ణయం గురించి కూడా మీడియా ద్వారానే తెలుసుకున్నామని అన్నారు. శాసనసభ పక్షంగా తమకు ఆ విషయంపై ఎలాంటి సమాచారం లేదని.. కాబట్టి విలీనంపై చర్చే లేదని పేర్కొన్నారు.

మరోవైపు తిరుగుబాటు ఎంపీల వర్గం తామే అసలైన టీఎంసీ అని గుర్తింపు కోరుతూ, పార్టీ ఎన్నికల గుర్తుపై కూడా హక్కు సాధించేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేల వర్గం మాత్రం అలాంటి పనులు చేయబోమని అంటోంది. మమతా బెనర్జీనే తమ నాయకురాలని.. ఆమె మార్గదర్శకత్వంలోనే తాము ముందుకు సాగాలని అనుకుంటున్నామని రితబ్రతా చెబుతున్నారు. 

అయితే అధికారిక టీఎంసీ వర్గం ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీ మొత్తం విలీనమైతేనే అది చట్టబద్ధమవుతుందని, కేవలం ఎంపీలు లేదంటే ఒక వర్గం విడిపోవడం ద్వారా కొత్త గ్రూప్‌కు గుర్తింపు ఇవ్వలేమని రాజ్యాంగంలోని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉటంకిస్తోంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీఎంసీలో అసంతృప్తి బహిర్గతమైంది. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నాయకత్వంపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ చీలిక మొదలైంది. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు.. 1998లో పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీ ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన అంతర్గత సంక్షోభం ఇదేనని చెబుతున్నారు.

ప్రస్తుతం తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం తమకు రెండొంతులకుపైగా సభ్యుల మద్దతు ఉందని చెబుతుండగా.. అధికారిక టీఎంసీ మాత్రం పార్టీ పూర్తిగా ఏకతాటిపై ఉందని.. తిరుగుబాటు నేతల వాదనలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని కొట్టిపారేస్తోంది. దీంతో బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ భవిష్యత్తు ఎటువైపు మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ మరింత పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement