
నదియా: పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో జూన్ 19న జరగనున్న కాలీగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నిక(Kaliganj Assembly by-election)కు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తమ అభ్యర్థిగా అలీఫా అహ్మద్ను ప్రకటించింది. అలీఫా అహ్మద్ దివంగత తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ కుమార్తె. ఈ విషయాన్ని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలిపింది.
‘పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ మార్గదర్శకత్వంలో పశ్చిమ బెంగాల్ శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం. కాలీగంజ్ అభ్యర్థి అలీఫా అహ్మద్’ అని టీఎంసీ తెలిపింది. సిట్టింగ్ అసెంబ్లీ సభ్యుడు నసీరుద్దీన్ అహ్మద్(Naseeruddin Ahmed) మృతితో కాలీగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరి అయింది. ‘లాల్ దా’గా పేరొందిన అహ్మద్ తన 70వ ఏట కన్నుమూశారు. ఆయన కాలీగంజ్ నియోజకవర్గానికి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు.
ఈ సీటుకు ఎంతో రాజకీయ ప్రాముఖ్యత ఉంది. ఇటీవల జరిగిన ఓటర్ల జాబితా సవరణ తర్వాత, కాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.5 లక్షల మంది నమోదిత ఓటర్లు ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలోని కాలీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గానికి జూన్ 19న ఉప ఎన్నిక జరగనున్నదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆదే రోజున ఉప ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కాలీగంజ్ ఒకటి. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం ఉప ఎన్నికల ఫలితాలు జూన్ 23న ప్రకటించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ జూన్ 2. జూన్ 3న వీటి పరిశీలన జరగనుంది. అభ్యర్థులు జూన్ 5 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ముప్పు తప్పినంతనే మరో ఘోరం.. ఆరుగురు దుర్మరణం