రాజస్తాన్లోని శ్రీగంగానగర్లో అధికారుల ‘బుల్డోజర్’న్యాయం
జైపూర్: అమాయక మైనర్ బాలికను బంధించి పలు హోటళ్ల యజమానులు, నిర్వాహకులు ఐదు రోజులపాటు దారుణంగా అత్యాచారం చేసిన ఘటనలో రాజస్తాన్లోని శ్రీగంగానగర్ నగర యంత్రాంగం, పోలీసులు బుల్డోజర్తో రంగంలోకి దిగారు. 13 ఏళ్ల బాలిక అత్యాచారాలకు వేదికలుగా మారిన మూడు హోటళ్లను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టం చేశారు.
ఐదు రోజుల వ్యవధిలో దాదాపు 30 మంది హోటల్ యజమానులు, ఆపరేటర్లు రేప్ చేసిన ఉదంతంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో అధికారులు ఇలా సంబంధిత హోటళ్లను కూల్చేసే పర్వానికి తెరలేపారు. గ్యాంగ్రేప్ ఘటనలో 30 మందిపై కేసు నమోదుచేయగా ఇప్పటిదాకా 14 మందిని అరెస్ట్చేశారు. హోటల్ను సక్రమంగా నిర్వహించకపోవడం, అక్రమంగా నిర్మించడం, భవనాల నిర్మాణ నిబంధనలను అతిక్రమించిన సెక్షన్ల కింద మూడు హోటళ్లను కూల్చేశామని శ్రీగంగానగర్ నగరపాలిక అధికారులు తెలిపారు.
హోటల్ ఖున్గర్, జోయ్ ఇన్, హోటల్ సఫైర్లను కూల్చేటప్పుడు ముందుజాగ్రత్తగా ఆయాప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. సబ్ డివిజినల్ మేజ్రిస్ట్రేట్ నయన్ గౌతం, అదనపు ఎస్పీ దీపక్ శర్మ, సర్కిల్ ఆఫీసర్ విష్ణు ఖత్రీ తదితరులు స్వయంగా హోటళ్ల కూల్చివేతను పర్యవేక్షించారు. జూన్ 18వ తేదీన బాలిక తన ఇంటి నుంచి తప్పిపోయి వీధిలో తిరుగుతుండగా ఒక రిక్షా కారి్మకుడు చేరదీసినట్లు నమ్మించి ఒక హోటల్ యజమానికి అమ్మేశాడు. అతను ఒక హోటల్లో బంధించి తనకు తెల్సిన హోటళ్ల యజమానులు, ఆపరేటర్లను రప్పించాడు. లైంగికదాడి వేళ నొప్పి తెలియకుండా బాలికకు మద్యం తాగించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. జూన్ 23వ తేదీన ఒక హోటల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసినప్పుడు ఈ బాలిక ఉదంతం బయటపడింది.


