కశ్మీర్‌లో ఉగ్రఘాతుకం | Jammu And Kashmir: Three Army Officers Die In Gunfight With Terrorists In Anantnag District - Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల ఘాతుకం.. ముగ్గురు ఆర్మీ అధికారులు మృతి..

Sep 13 2023 7:49 PM | Updated on Sep 14 2023 12:41 PM

Three Army Officials Died In Gunfight With Terrorists In Anantnag  - Sakshi

కల్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్, డిప్యూటీ ఎస్పీ భట్‌

రాజౌరీ/జమ్మూ: ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టిన సైన్యంపై ఉగ్రవాదులు మాటువేసి మెరుపుదాడి చేశారు. ఈ దుర్ఘటనలో ఆర్మీ కల్నల్, మేజర్, డిప్యూటీ ఎస్పీలు వీరమరణం పొందారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలోని గరోల్‌ దగ్గర్లోని కొకొరెనాగ్‌ కొండ ప్రాంతంలో జరిగింది. రాజౌరీలో ఉగ్రకాల్పుల్లో జవానును కాపాడబోయి సైనిక జాగిలం కెంట్‌ ప్రాణాలు కోల్పోయిన మరుసటి రోజే ఈ కాల్పుల ఘటన జరగడం విషాదకరం.

బుధవారం ఉదయం సైనిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొకొరెనాగ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో మంగళవారం రాత్రి సైన్యం, కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వెంటనే తూటాల వర్షం కురిపించారు. దీంతో 19వ రాష్ట్రీయ రైఫిల్స్‌ కమాండింగ్‌ అధికారి అయిన కల్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్, మేజర్‌ ఆశిశ్‌ ధోనక్, డిప్యూటీ ఎస్పీ హుమయూన్‌ భట్‌ నేలకొరిగారు.

జమ్మూకశ్మీర్‌ మాజీ ఐజీ గులామ్‌ హసన్‌ భట్‌ కుమారుడే ఈ హుమయూన్‌. కాల్పుల ఘటనకు నిషేధిత రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ లష్కరే తోయిబానే ఈ రెసిస్టెంట్‌ ఫ్రంట్‌ సంస్థను వెనక ఉండి నడిపిస్తోంది. ఆగస్టు నాలుగో తేదీన కుల్గామ్‌ జిల్లాలోని హలన్‌ అటవీప్రాంతంలో ముగ్గురు జవాన్ల మరణానికి కారకులైన వారే బుధవారం దాడి చేశారని సైనిక నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి: సైనికున్ని రక్షించేందుకు.. తూటాలకు ఎదురునిలిచి.. సైనిక శునకం ప్రాణ త్యాగం

Advertisement
 
Advertisement
Advertisement