
బహ్రాయిచ్: యూపీలోని బహ్రాయిచ్లో తోడేళ్ల భీభత్సం కొనసాగుతోంది. నాన్పరా తహసీల్ పరిధిలో ఒక ఇంటి బయట కట్టిన మేకను తోడేళ్లు చంపుకుతిన్నాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. దానిలో తోడేళ్లు మేకను తమ నోట కరచుకుని తీసుకువెళుతున్న దృశ్యాలు కనిపించాయి.
ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాంస భక్షక తోడేళ్లు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పాలనా యంత్రాంగం ఇప్పటి వరకు చాలా తోడేళ్లను పట్టుకున్నప్పటికీ, తోడేళ్ల దాడులు ఆగడం లేదు. తాజాగా బహ్రాయిచ్లోని బీజేపీ శాసనమండలి సభ్యుడు పద్మాసేన్ చౌదరి ఫామ్హౌస్లో నాలుగు తోడేళ్ల గుంపు కనిపించింది. వీటిలో ఒక కుంటి తోడేలు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెతుకుతున్న తోడేలు ఇదేనని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త తోడేళ్ల గుంపు స్థానికులను మరింతగా భయపెడుతోంది.
ఆరు తోడేళ్ళ గుంపు మనుషులపై దాడి చేస్తున్నదని గుర్తించిన అటవీశాఖ అధికారులు అతికష్టం మీద ఐదు తోడేళ్లను పట్టుకున్నారు. ఇంకా ఒక తోడేలు మిగిలివుందని చెబుతున్నారు. కాగా ఆ తోడేళ్ల గుంపు నరమాంస భక్షకులుగా మారడానికి కారణమేమిటన్నది పరిశోధించాల్సిన అంశమని అటవీ అధికారి తెలిపారు. తాజాగా తోడేళ్లు కనిపించిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి, విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: World Rose Day 2024: క్యాన్సర్ను జయించాలని కోరుకుంటూ..