యాక్షన్‌ ప్లాన్‌ ఏది?.. నేపాల్‌లో తమిళ యాత్రికుల మిస్సింగ్‌ | Tamil Pilgrims Missing in Nepal Floods: Opposition Targets Vijay Govt | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ప్లాన్‌ ఏది?.. నేపాల్‌లో తమిళ యాత్రికుల మిస్సింగ్‌

Aug 27 2026 1:33 PM | Updated on Aug 27 2026 2:08 PM

Tamil Pilgrims Missing in Nepal Floods: Opposition Targets Vijay Govt

నేపాల్‌–టిబెట్‌ సరిహద్దులో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మృతుల సంఖ్య పెరుగుతుండగా.. అక్కడికి వెళ్లిన భారతీయ యాత్రికుల ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన తమిళ యాత్రికుల పరిస్థితిపై ఆ రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.

కుంభకోణానికి చెందిన సూపర్‌ ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా మొత్తం 57 మంది తమిళ యాత్రికులు మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినట్లు ఇప్పటికే అక్కడి అధికారులు ప్రకటించారు. వీరిలో 20 మంది సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందగా.. మరో 37 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. అయితే టీవీకే సర్కార్‌ ఈ మధ్యాహ్నాం దాకా ఎలాంటి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయకపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఏం చర్యలు తీసుకున్నారు?
ఈ వ్యవహారంపై తమిళనాడు టీవీకే ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీశాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మాట్లాడుతూ.. నేపాల్‌లో చిక్కుకున్న తమిళ యాత్రికుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రశ్నించారు. “ఎంతమంది యాత్రికులు గల్లంతయ్యారు? ప్రభుత్వ హెల్ప్‌లైన్‌కు ఎన్ని కాల్స్‌ వచ్చాయి? ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టారు?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

అన్నాడీఎంకే నేత ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఆ 57 మంది తమిళ యాత్రికులను సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు టీవీకే మిత్రపక్షం కాంగ్రెస్‌ పార్టీ.. నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల రక్షణ కోసం ప్రత్యేక హెలికాప్టర్‌ పంపాలని కోరింది.

57 కాదు.. 106 మంది
తమిళనాడు మంత్రి రాజ్‌మోహన్‌ అసెంబ్లీలో మాట్లాడుతూ.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, అక్కడి అధికార యంత్రాగంతో ఎప్పటికప్పుడు సమన్వయం జరుపుతున్నామని తెలిపారు. కుంభకోణం ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా 57 మంది వెళ్లగా.. చెన్నైకి చెందిన మరో ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా మరో 49 మంది యాత్రికులు మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినట్లు సమాచారం ఉందన్నారు. వారి వివరాలను కూడా సేకరిస్తున్నట్లు తెలిపారు.

చివరి ఫోన్‌ కాల్‌.. నో రెస్పాన్స్‌
తమ కుటుంబ సభ్యుల నుంచి చివరిసారిగా వచ్చిన ఫోన్‌ కాల్‌ తర్వాత యాత్రికుల బంధువుల్లో ఆందోళన మరింత పెరిగింది. విష్ణు రామస్వామి అనే వ్యక్తి మాట్లాడుతూ.. తన తల్లి, ఇద్దరు సోదరీమణులు యాత్రలో ఉన్నారని తెలిపారు. “ఆగస్టు 23న వారు బయలుదేరారు. ఢిల్లీ, ఖాట్మండు చేరుకున్న తర్వాత ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఫోన్‌ చేసేవారు. ఆగస్టు 26 ఉదయం 6.15 గంటలకు చివరిసారి మాట్లాడారు. తాము క్షేమంగానే ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత ఫోన్‌ సంబంధాలు తెగిపోయాయి” అని ఆందోళన వ్యక్తం చేశారు.

విజయ్‌ అత్యవసర సమావేశం
అసెంబ్లీలో నేపాల్‌ వరదల మిస్సింగ్‌పై ఆందోళనలు వ్యక్తం అయ్యాక.. ముఖ్యమంత్రి విజయ్‌ ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడిన ఆయన.. అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆచూకీ కోసం ప్రయత్నాలు
నేపాల్‌–టిబెట్‌ సరిహద్దు ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన భారతీయుల వివరాలను సేకరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేపాల్‌ అధికారులతో సమన్వయం చేస్తున్నాయి. చాలామంది యాత్రికుల బృందాలు వరదల కంటే ముందే ఆ ప్రాంతాన్ని దాటినట్లు సమాచారం అందుతోంది. దీంతో యాత్రికుల సురక్షిత తరలింపుపై కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.

ఇదీ చదవండి: విపత్తుల నేపాల్‌.. ఆ ట్రాక్‌ రికార్డు అంత ఘోరం మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement