ఆహార పొట్లాలపై సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: ఆహార పొట్లాల్లో (ప్యాకేజ్డ్ ఫుడ్) పోషకాల వివరాలతో కూడిన లేబుళ్లకు సంబంధించి మరింత స్పష్టతనివ్వాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్’ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ను ఆదేశించింది. దశలవారీగా ఆహార పొట్లాలపై లేబుళ్లు అతికించడాన్ని అమలు చేస్తామన్న ఎఫ్ఎస్ఎస్ఏఐ కొవ్వు, చక్కెర, ఉప్పు వంటి ‘‘ఆందోళనకరమైన పోషకాల’గురించి మరింత వివరణతో రావాలని జస్టిస్ జే.బి.పార్డీవాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్లతో కూడిన బెంచ్ ఆదేశించింది.
దేశంలో పిల్లలు అనారోగ్య ఆహారపు అలవాట్లకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన బెంచ్.. పోషకాలపై వారికి అవగాహన పెంచేందుకు పాఠశాలల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘‘బోధనాంశాలు, వర్క్షాపులు, కార్యక్రమాల ద్వారా ఆహారపు పొట్లాలపైని సమాచారాన్ని అర్థం చేసుకునేలా చేసేందుకు పాఠశాలలు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాయో కేంద్రం నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నాం.
ఆహారపు పొట్లాలపైని లేబుల్లు, పోషకాల సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోషకాలపై అవగాహనకు సంబంధించిన అంశాలు రెండింటిపై కేంద్రం స్పందించాలి’’అని బెంచ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 28న జరగనుంది. ‘త్రీఎస్ అండ్ అవర్ హెల్త్ సొసైటీ’అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆహారపు పొట్లాలపై పోషకాలకు సంబంధించిన లేబుళ్లను తప్పనిసరిగా అతికించేలా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించాలని ఈ స్వచ్ఛంద సంస్థ తన పిటిషన్లో కోరింది.
అయితే అసంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారపు పొట్లాల ముందుభాగంగా స్పష్టంగా కనిపించేలా లేబుళ్లను ఏర్పాటు చేయిస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ అంశం అమలుకు సంబంధించి గత నెలలో ఒక అఫిడవిట్ దాఖలు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ లేబుళ్లను అతికించే ప్రక్రియను రెండు దశల్లో చేపడుతున్నట్లు తెలిపింది. అయితే ఈ రెండు దశలు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలపాలని, వినియోగదారులు ఆమోదించేందుకు, కంపెనీలకు తగిన సమయం ఇచ్చేందుకు వేచి చూడటం సరికాదని స్పష్టం చేసింది. మరో పది రోజుల్లోగా ఏ దశను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తెలపాలని ఆదేశించింది.


