భారత రాజధాని ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ ఏడాది భారత్ నాలుగోసారి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. అంతేకాక సంస్థ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలు దేశాధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొననున్నారు.
ప్రధాన చర్చనీయాంశాలు
గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలు: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలపై నేతలు చర్చించనున్నారు. ప్రపంచ పాలనా వ్యవస్థలు ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా మార్పులు తేవాలన్నది ప్రధాన డిమాండ్గా ఉంది. ఇందులో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించే అంశం కీలకంగా మారనుంది.
వాణిజ్యం, ఆర్థిక సహకారం: సభ్యదేశాలు వాణిజ్య మార్గాలను బలోపేతం చేసేందుకు 2026-2030 బ్రిక్స్ గ్లోబల్ వేల్యూ చైన్ యాక్షన్ ప్లాన్ను ఆమోదించాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యంత్రాంగం, సహకార పోర్టల్ ఏర్పాటుపై చర్చలు జరగనున్నాయి.
సాంకేతికత, ఇన్నోవేషన్: స్టార్టప్ ఇంక్యుబేటర్ నెట్వర్క్, ఇన్నోవేషన్ ఫండ్ ఏర్పాటుతో పాటు ఏఐ గవర్నెన్స్పై కూడా నేతలు దృష్టి సారించనున్నారు. భవిష్యత్ సాంకేతిక పోటీలో సభ్యదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగే వ్యూహాలపై చర్చిస్తారు.
ఆహార, ఇంధన భద్రత: ఆహారం, ఇంధన భద్రత, ఆరోగ్యం, వ్యవసాయం రంగాల్లో సహకారంపై నేతలు లోతైన చర్చలు జరపనున్నారు. పేదరిక నిర్మూలన, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు సంయుక్త కార్యాచరణపై దృష్టి పెడుతారు.
ద్వైపాక్షిక భేటీలు, ప్రపంచ అంశాలు: భారత్-చైనా సహా వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు. అలాగే వాణిజ్యం, అభివృద్ధి, సంస్థాగత సంస్కరణలపై సభ్యదేశాల మధ్య సన్నిహిత సహకారంపైనా చర్చించనున్నారు.
ఇదీ చదవండి: కొత్త బిజినెస్లోకి ఫ్లిప్కార్ట్!


