రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే చట్టాలుగా ఆ 10 బిల్లులు  | Supreme Court pulled up Tamil Nadu Governor, 10 Bills Cleared | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి, గవర్నర్‌ ఆమోదం లేకుండానే చట్టాలుగా ఆ 10 బిల్లులు 

Apr 13 2025 4:58 AM | Updated on Apr 13 2025 4:58 AM

Supreme Court pulled up Tamil Nadu Governor, 10 Bills Cleared

స్టాలిన్‌ సర్కారు గెజిట్‌ 

దేశ చరిత్రలోనే తొలిసారి

చెన్నై/న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవికి మధ్య వివాదానికే గాక అంతిమంగా సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుకు కారణమైన 10 బిల్లులు ఎట్టకేలకు చట్టంగా మారాయి. ఆ క్రమంలో మరో సంచలనానికి కారణమయ్యాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్‌ గానీ, రాష్ట్రపతి గానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయి! ఇది భారత శాసననిర్మాణ చరిత్రలోనే కనీవిని ఎరుగని సంఘటనగా నిలిచిపోనుంది. 

ఆ 10 బిల్లులను అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపినా గవర్నర్‌ ఆమోదముద్ర వేయకుండా రాష్ట్రపతి పరిశీలనకు పంపడం, అది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చడం తెలిసిందే. వాటికి గవర్నర్‌ ఆమోదం లభించినట్టుగానే పరిగణిస్తున్నట్టు పేర్కొంటూ ఆర్టికల్‌ 142 కింద తనకు సంక్రమించిన విశేషాధికారాల ద్వారా ఏప్రిల్‌ 8న తీర్పు వెలువరించింది. దాంతో గవర్నర్‌ గానీ, రాష్ట్రపతి గానీ లాంఛనంగా ఆమోదించకుండానే సదరు 10 బిల్లులకు స్టాలిన్‌ సర్కారు చట్టబద్ధత కల్పించగలిగింది.

 తీర్పు పూర్తి ప్రతి శుక్రవారం రాత్రి అందుబాటులోకి రాగానే ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగానే వాటికి చట్టరూపం కల్పిస్తున్నట్టు అందులో స్పష్టంగా పేర్కొంది. వీటిలో తమిళనాడు వర్సిటీలు, ఫిషరీస్‌ వర్సిటీ, వైస్‌ చాన్స్‌లర్ల బిల్లులు తదితరాలున్నాయి. దీన్ని చరిత్రాత్మక ఘటనగా డీఎంకే అభివర్ణించగా చరిత్ర సృష్టించడం తమ పార్టీ నైజమంటూ సీఎం స్టాలిన్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. 

రాజకీయాలకు అతీతంగా ఉండాలి 
రాష్ట్రస్థాయిలో ఒక బిల్లు చట్టంగా రూపొందాలంటే ముందుగా అసెంబ్లీ, తర్వాత గవర్నర్‌ ఆమోదం పొందాలి. గవర్నర్‌ దాన్ని ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టవచ్చు. రాష్ట్రపతి పరిశీలనకు పంపవచ్చు. లేదంటే అసెంబ్లీ పునఃపరిశీలన నిమిత్తం తిప్పి పంపవచ్చు. అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా గవర్నర్‌ విధిగా అనుమతి తెలిపాల్సిందే. అలాగాక రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను తమిళనాడు గవర్నర్‌ రాష్ట్రపతి పరిశీలనకు పంపడాన్ని స్టాలిన్‌ సర్కారు 2023లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 

దీనిపై కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది. గవర్నర్‌ చర్య రాజ్యాంగవిరుద్ధమని, ఆర్టికల్‌ 200కు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. గవర్నర్‌ పునఃపరిశీలనకు వచ్చిన 2023 నవంబర్‌ 18వ తేదీనే బిల్లులకు ఆమోదం లభించినట్టే పరిగణిస్తున్నట్టు పేర్కొంది. అంతేగాక, ‘‘ఇకపై గవర్నర్లు తమ వద్దకొచ్చే బిల్లులపై  మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. అదే బిల్లు రెండోసారి వస్తే నెలలోపు ఆమోదం తెలిపి తీరాలి’’ అని గడువు విధిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 

తద్వారా గవర్నర్‌ వ్యవస్థను తక్కువ చేయడం తమ ఉద్దేశం కాదని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఆ స్థానానికి ఉండే అత్యున్నత గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత గవర్నర్లపై ఉంటుంది. ప్రథమ పౌరునిగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి అని ప్రమాణం చేశాక రాజకీయ మొగ్గుదలలు తదితరాలకు అతీతంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మెలగాలి. అలాగాక ప్రజలకు ప్రతిరూపమైన అసెంబ్లీ నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడమంటే చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే’’ అని స్పష్టం చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement