‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు | Supreme Court Fire On Up CM Yogi Government Over Bulldozer Action | Sakshi
Sakshi News home page

‘మీ తీరు అమానవీయం’.. సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు

Apr 1 2025 5:12 PM | Updated on Apr 1 2025 5:24 PM

Supreme Court Fire On Up CM Yogi Government Over Bulldozer Action

లక్నో: ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి సర్కార్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోందని వ్యాఖ్యానించింది.  

2023లో యూపీకి చెందిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్య గురయ్యాడు. హత్యకు గురైన అతిక్‌ చెందిన స్థిరాస్థుల్ని అధికారులు కూల్చివేశారు. వాస్తవానికి బుల్డోజర్‌తో కూల్చేసిన నిర్మాణాలతో అతిక్‌కు సంబంధం లేదు. ఆ ఇళ్లు లాయర్లు, ప్రొఫెసర్లతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వహిస్తున్నవారివి.  

ఎప్పటిలాగే సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపే సీఎం యోగి ప్రభుత్వం (Yogi Adityanath) పొరపాటున బాధితుల ఇళ్లను బుల్డోజర్లతో (Bulldozer justice) కూల్చేసింది. దీంతో బాధితులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

రూ.10లక్షల నష్టపరిహారం 
ఆ పిటిషన్లపై మంగళవారం సుప్రీం కోర్టు జస్టిస్ ఎస్ ఓకా,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా బూల్డోజర్‌ చర్యలపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి సర్కార్‌తో పాటు ప్రయాగ్‌రాజ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీ తీరు రాజ్యాంగ విరుద్ధం. అమానవీయం. మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేస్తోంది. తక్షణమే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారం అందించాలని సూచించింది.

అది మా పొరపాటే
అంతకుముందు అడ్వకేట్‌, ప్రొఫెసర్‌ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్ల గురించి అత్యున్నత న్యాయస్థానం యూపీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. నిబంధనలకు విరుద్ధంగా బుల్డోజర్లతో ఇళ్లను ఎలా కూల్చేస్తారు? కూల్చేవేతకు ఓ రోజు ముందు నోటీసులు ఎలా అంటిస్తారని ప్రశ్నించింది. అయితే, సుప్రీం ధర్మాసనం అడిగిన ప్రశ్నలకు యూపీ అధికారులు బదులిచ్చారు. మేం కూల్చేసిన ఇళ్లు గ్యాంగ్‌స్టర్‌ అతిక్‌ నిర్మించుకున్నాడేమోనని పొరపాటున బుల్డోజర్‌ చర్యలకు దిగినట్లు వివరణ ఇచ్చారు.

రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదు
కూల్చివేత నోటీసులు అందజేసిన తీరుపై అధికారులను  కోర్టు మందలించింది. కూల్చేసిన ఇళ్లనకు నోటీసులు అతికించామని రాష్ట్ర న్యాయవాది చెప్పగా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసులు ఎందుకు పంపలేదని అడిగింది. అదే సమయంలో ఈ తరహా చర్యల్ని వెంటనే ఆపాలి. బాధితులు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. వారికి నష్టపరిహారం కింద రూ.10 లక్షల పరిహారం చెల్లించండి.  పరిహారం ఇస్తే వారికి న్యాయం జరిగినట్లవుతుందని జస్టిస్‌ ఎస్‌.ఓకా అభిప్రాయం వ్యక్తం చేశారు.

మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి
ఈ కేసులు మా మనస్సాక్షిని షాక్‌కు గురిచేస్తున్నాయి. పిటిషనర్ల ‌ ఇళ్లను నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేశారని కోర్టు అభిప్రాయ పడినట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు కూల్చేస్తున్నట్లు నోటీసులు గాని, నోటీసులు తీసుకున్న వారికి వివరణ ఇచ్చేందుకు తగిన అవకాశం ఇవ్వలేదని ప్రస్తావించింది.  

 అందరూ కలత చెందుతున్నారు
అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో బుల్డోజర్‌ కూల్చివేతల సమయంలో వైరలైన ఓ వీడియో గురించి కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. అధికారులు బుల్డోజర్లతో ఇళ్లను కూల్చే సమయంలో సదరు ఓ ఇంటికి చెందిన బాలిక తన పుస్తకాల్ని చేతపట్టుకుని ఉండడాన్ని చూడొచ్చు. ఇలాంటి దృశ్యాలతో అందరూ కలత చెందుతున్నారు’ అని జస్టిస్ భుయాన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement