కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తిట్లు ఎంత అభ్యంతరకరంగా, అనాగరికంగా ఉన్నప్పటికీ అసభ్య పదజాలం, బూతులు తిట్టడం అశ్లీల నేరంగా పరిగణించలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. ఒకరిని ‘మదర్ ఫ...ర్’, ‘సన్ ఆఫ్ ఎ వోర్’ వంటి అసభ్య పదాలతో దూషించడం అశ్లీలం కాదని వ్యాఖ్యానించింది. చట్టపరంగా అశ్లీలంగా పరిగణించాలంటే వాటికి ప్రత్యేకమైన ప్రమాణాలు ఉండాలని స్పష్టం చేసింది. తమిళనాడుకు చెందిన మణి అనే వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్ను పాక్షికంగా అనుమతించిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ విపుల్ పంఛోలీల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
ఈ సందర్భంగా కోర్టు చట్టపరమైన ‘అశ్లీల’ భావనను విశదీకరించింది. ‘అసభ్యత (వల్గారిటీ), తిట్లు (అబ్యూజ్), బూతులు (ప్రొఫానిటీ) చట్టపరంగా అశ్లీలత కాదు. కేవలం బూతులు మాట్లాడటం, అసభ్య పదజాలం ఉపయోగించడం, తిట్టడాన్ని అశ్లీల నేరంగా పరిగణించలేం. అలాంటి పదాలు అసహ్యం, విరక్తి లేదా షాక్కు గురిచేయవచ్చు. లైంగిక ఉద్రేకాన్ని రేకెత్తించే, కామప్రేరిత ఆసక్తిని ప్రోత్సహించే, విన్నవారి నైతిక విలువలను దెబ్బతీసే లేదా వారిని నీతిభ్రషు్టలుగా మార్చే ప్రభావం ఉంటేనే అశ్లీలంగా పరిగణించవచ్చు. బహిరంగ ప్రదేశంలో ఇతరులకు ఇబ్బంది కలిగించిందని నిరూపించాల్సి ఉంటుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడులో 2017 ఆగస్టులో జరిగిన వ్యవసాయ భూమి వివాదానికి సంబంధించిన కేసును ధర్మాసనం విచారించింది.


