
ఢిల్లీ : తల్లిదండ్రుల గురించి, శృంగారం పైన ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీం కోర్టులో (supreme court) ఊరట దక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగిపోయిన పాడ్ కాస్ట్ ‘ది రణ్వీర్ షో’తో పాటు ఇతర షోలను తిరిగి ప్రారంభించుకోవడంతో పాటు వాటిని ప్రసారం చేసుకోవచ్చని తెలిపింది.
‘ఇండియాస్ గాట్ లాటెంట్’ (India's Got Latent) వేదికగా యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో అల్హాబాదియా వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. అల్హాబాదియా చేస్తున్న షోలు సైతం ఆగిపోయాయి.
అయితే, అల్హాబాదియా తాను ఇంటర్వ్యూలు, షోలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాదు,తాను చేస్తున్న షోలపై సుమారు 280 మంది ఆధారపడ్డారని, షోలు ఆగిపోవడం వల్ల వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు
ఆ పిటిషన్పై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. అల్హబాదియా పిటిషన్పై కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా తాను ఉత్సుకతతో అల్హాబాదియా షోను చూశానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ఆ షో అసభ్యంగా మాత్రమే కాదు.. వక్రంగా ఉందని వ్యాఖ్యానించారు. హాస్యం, అసభ్యత, వక్రబుద్ధి మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉందని నొక్కి చెప్పారు.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కు, అశ్లీలత విషయంలో స్పష్టమైన సరిహద్దు ఉండాలని పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా అల్హాబాదియాకు సుప్రీం కోర్టు చురకలంటించింది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని, అసభ్య పదజాలం వాడటం హాస్యం కాదని మందలించింది. అల్హాబాదియా షోలు చేసుకోవచ్చని, నైతికంగా, మర్యాద ఉండాలని సూచించింది.
