
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేడు (మంగళవారం) న్యూఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ను కలవనున్నారు. జూన్ 4న బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన ఘటనపై కాంగ్రెస్ అధిష్ఠానంతో సీఎం చర్చించనున్నారని సమాచారం.
ఈ తొక్కిసలాట ఘటన దరిమిలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురైంది. ఈ ఘటనకు సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ ప్రత్యక్షంగా బాధ్యులని ఆరోపిస్తూ, వారు రాజీనామా చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీజేపీ, జేడీ(ఎస్)లు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ను కలుసుకోనున్న సిద్ధరామయ్య, డీకేఎస్లు ఆర్సీబీ విజయోత్సవ ఘటన తొక్కిసలాట పూర్వాపరాలపై సమగ్రంగా చర్చించనున్నారు.
‘సిద్ధరామయ్య ఢిల్లీలో పార్టీ నాయకత్వాన్ని కలుస్తారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై వారికి వివరిస్తారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) అధికారులతోపాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ను సందర్శించిన డిప్యూటీ సీఎం నేడు తిరిగి ఢిల్లీకి వెళుతున్నారు. జూన్ నాలుగున సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది మృతి చెందారు.
ఆర్సీబీ జట్టు విజయోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. నాటి తొక్కిసలాట ఘటనలో 56 మంది గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ తన నుండి సమాచారం కోరిందనే వార్తలను సిద్ధరామయ్య తోసిపుచ్చారు. కాగా నేటి అధిష్టానం భేటీలో గవర్నర్ ఎంపిక నామినేషన్ల కోసం సిఫార్సు చేసిన నాలుగు పేర్లు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: ‘మత్తిచ్చి తెచ్చారు’.. ‘హనీమూన్ జంట’ కేసులో మరో ట్విస్ట్