టెక్సాస్ను వణికిస్తున్న ఈగ
నిర్జీవ కణజాలం బదులు పచ్చి మాంసం తింటున్న లార్వాలు
పశువులతో పాటు మనుషులకూ సోకే ముప్పు
నిర్మూలించిన దశాబ్దాల తర్వాత మళ్లీ ముందుకొచ్చిన ముప్పు
ఒక అడవి జాతి ప్రాణాంతక మాంసాహార ఈగ అమెరికాను వణికిస్తోంది. దీంతో అత్యవసర పరిస్థితులు, ఎగుమతులపై నిషేధాలు విధించారు. క్వారంటైన్ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. సాధారణ ఈగ గుడ్ల నుంచి పుట్టే తెల్లని పురుగులు(మ్యాగట్స్/లార్వాలు) చనిపోయిన కణజాలాలను తింటే ఈ ఈగ లార్వాలు సజీవ మాంసాన్నే తింటున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ లార్వా పేరు ‘న్యూ వరల్డ్ స్రూ్కవార్మ్’(ఎన్డబ్ల్యూఎస్). ఇది సోకితే పశువులు, పందులు, మేకలు, పెంపుడు జంతువులే కాకుండా మనుషులకు కూడా ముప్పే.
టెక్సాస్లో ఎమర్జెన్సీ
కొద్దిరోజుల క్రితం టెక్సాస్లోని పశువులు, మేకలతోపాటు న్యూమెక్సికోలోని ఒక పెంపుడు కుక్కలో స్రూ్కవార్మ్ కేసులను గుర్తించినట్లు అధికారులు నిర్ధారించారు. టెక్సాస్ వ్యవసాయ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. టెక్సాస్లో పశువులు, గుర్రాల దిగుమతిని కెనడా నిషేధించింది. అంతకుముందు మెక్సికోలో ఈ కేసులు రావడంతో అమెరికా కూడా మెక్సికో నుంచి పశువుల ఎగుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది.
మాంసాన్ని కొరికి తింటాయి
గాయాలు, తెగిన గాట్లు, పేలు కుట్టిన చిన్న రంధ్రాలు లేదా చర్మం తెరుచుకున్న భాగాలపై ఆడ ఈగ వందల గుడ్లు పెడుతుంది. కొన్ని గంటల్లోనే ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలు బయటకు వచ్చి, బతికున్న జీవుల ఆరోగ్యకర మాంసాన్ని కొరికి తింటాయి. సకాలంలో చికిత్స అందించకపోతే.. తీవ్ర గాయాలు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల జంతువులు 7 నుంచి 14 రోజుల్లో చనిపోతాయి.
కొత్తదేమీ కాదు..
అమెరికాకు స్క్రూవార్మ్ కొత్తదేమీ కాదు. అయితే దశాబ్దాల క్రితమే అమెరికా, మెక్సికోలు మాంసాన్ని తినే ఈ ఈగ జాతిని నిర్మూలించాయి. ఉత్తర అమెరికా సరిహద్దుల్లోకి ఇటీవల తిరిగి ప్రవేశించిన ఈ ప్రమాదకర పరాన్నజీవి.. పశుసంవర్థక రంగానికి పెనుముప్పుగా మారింది.
గతంలో స్టెరైల్ ఇన్సెక్ట్ కెక్నిక్ ద్వారా అమెరికాలో దీన్ని నిర్మూలించారు. ఇందులో భాగంగా ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన మిలియన్ల కొద్దీ సంతానోత్పత్తి చేయలేని మగ ఈగలను ప్రకృతిలోకి వదిలారు. తద్వారా వాటి సంతానోత్పత్తి ఆగిపోయింది. అయితే తూర్పు పనామాలోని డారియన్ గ్యాప్ బయోలాజికల్ బారియర్ క్వారంటైన్ జోన్ నుంచి ఈ ఈగలు తప్పించుకొని మధ్య అమెరికా మీదుగా ఉత్తర దిశగా వ్యాపించడంతో ఇప్పుడు మళ్లీ ఈ ముప్పు వచ్చింది. దీంతో టెక్సాస్లో కొత్తగా భారీ స్థాయిలో స్టెరైల్ ఫ్లై ప్రొడక్షన్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మనుషులకు సోకిన కొన్ని కేసుల్లో శస్త్రచికిత్స ద్వారా పురుగులను తీసేసి యాంటీ పారాసిటిక్ మందులతో నయం చేశారు.


