రోహిణి, రూపా బదిలీ | Rupa Moudgil And Rohini Sindhuri Others transferred in Karnataka | Sakshi
Sakshi News home page

రోహిణి, రూపా బదిలీ

Jun 13 2025 12:46 PM | Updated on Jun 13 2025 1:11 PM

Rupa Moudgil And Rohini Sindhuri Others transferred in Karnataka

బొమ్మనహళ్లి: ఐఏఎస్‌ అధికారిణి డి.రోహిణి సింధూరి, ఐపీఎస్‌ అధికారిణి డి.రూపాతో పాటు పలువురు ఉన్నతాధికారులను సర్కారు బదిలీ చేసింది. ఇందులో రోహిణి, రూపా ఇద్దరు తగవులు పడుతూ కేసులు పెట్టుకోవడం తెలిసిందే.

కర్ణాటకలో పలువురు అధికారుల బదిలీలు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా స్కిల్‌ డెవలప్‌మెంటు బోర్డు ఎండీగా ఉన్న రూపాను బెంగళూరు మెట్రో పాలిటన్‌ టాస్క్‌ఫోర్స్‌ అదనపు డిజీపీగా బదిలీ చేశారు. రోహిణిని వ్యవసాయ శాఖ, ఆహార సంస్కరణల విభాగం కార్యదర్శి స్థానం నుంచి కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఎస్‌బీ శెట్టణ్నవర్‌ను బెళగావి స్థానిక కమిషనర్‌గా, అక్రం పాషాను ఆర్టీసీ ఎండీగా నియమించారు.

వీరి మధ్య వివాదం ఇలా.. 
ఇదిలా ఉండగా.. ఒక  మహిళా ఐఏఎస్‍.. ఒక మహిళా ఐపీఎస్ ల మధ్య ఎప్పుడో నాలుగేళ్ల క్రితం మొదలైన వివాదం నేటికి కొనసాగుతూనే ఉంది.  కన్నడ నాట ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ రూపాల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆరంభమైన రచ్చ కాస్తా గాలివానలా మారింది. ప్రస్తుతం వీరి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో వీరి వ్యవహారంపై కేసు కూడా నమోదైంది.

ఈ కేసు విచారణలో భాగంగా 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ వీరి మధ్య సంభాషణను భద్రపరిచాల్సిందిగా మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు భారతి ఎయిర్ టెల్‍- రిలయన్స్ జియోలకు  ఆదేశాలిచ్చింది. తన వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలు పెట్టి పరువు భంగం వాటిల్లేలా చేసిన కారణంగా రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతోంది. ఇదే సమయంలో తమ ఇద్దరి మధ్య వివాదానికి సంబంధించి కాల్ డేటా రికార్డు(సీడీఆర్)ను ఒక్కసారి పరిశీలించాల్సిందిగా  ఐపీఎస్ రూపా మెజిస్ట్రేట్ కోర్టులో దరఖాస్తు‍ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ కేసు విచారణ బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు ముందుకు వచ్చింది.  దీనిపై విచారణ చేపట్టిన మెజిస్ట్రేట్ కోర్టు.. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాల్ డేటా రికార్డును భద్రపరిచి ఉంచాల్సిందిగా ఇరు టెలికాం సర్వీసులకు ఆదేశాలిచ్చింది.

ఐపీఎస్ రూపా విచారణకు హాజరుకాకుండా జాప‍్యం చేస్తున్న కారణంగా ఆమెను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే ప్రక్రియను నిలిపివేయాలంటూ ఐఏఎస్ రోహిణి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.  అదే సమయంలో తమ మధ్య చోటు చేసుకున్న వివాదాన్ని కాల్ డేటా ఆధారంగా పరిశీలించాలని రూపా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అందులో 2021 జనవరి 15వ తేదీ నుంచి 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకూ తమ మధ్య సాగిన సంభాషణను పరిశీలించాలని కోరుతూ, ఆ మేరకు టెలికాం సంస్థలకు ఆదేశాలివ్వాలని రూపా డి పేర్కొంది. దాంతో  ఈ నెల ఆరంభంలో  విచారణ చేపట్టిన బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు.. తాజాగా వారి మధ్య సాగిన సంభాషణ కాల్ డేటా రికార్డును పొందుపరచాల్సిందిగా సదరు టెలికాం సంస్థలకు ఆదేశాల్లో పేర్కొంది.

రాజీ కుదరలేదు..!
వీరి మధ్య చోటు చేసుకున్న వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి స్టేను కూడా విదించింది సుప్రీంకోర్టు. అయితే వీరి మధ్య  పరస్పర అంగీకారం కుదరకపోవడంతో ఆ కేసుపై అప్పటివరకూ కొనసాగిన స్టేను గతేడాది సుప్రీంకోర్టు ఎత్తివేసింది. 

​కాగా,  సుమారు రెండేళ్ల క్రితం​ఐఏఎస్‌ రోహిణికి వ్యతిరేకంగా ఐపీఎస్‌ రూపా ఫేస్‌బుక్‌లో తీవ్ర విమర్శలతో పలు పోస్ట్‌లు చేశారు. అందులో రోహిణి సింధూరి వ్యక్తిగత ఫొటోలను పోస్ట్‌ చేసి ఆమె పాల్పడుతున్న అక్రమాలు ఇవీ అని పలు ఆరోపణలను గుప్పించారు. ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలా కోర్టుల వరకూ వెళ్లిన కేసు నేటికి పరిష్కారం దొరకలేదు. తన పరువుకు భంగం వాటిల్లేలా చేసినందుకు కోటి రూపాయిలు నష్ట పరిహారం ఇవ్వాల్సిందేనని ఐఏఎస్ రోహిణి పట్టుబడుతుండగా, అసలు వివాదానికి కారణం ఏమిటో ఒక్కసారి కాల్ డేటా రికార్డును పరిశీలిస్తే తెలుస్తుందని రూపా అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement