820 కోట్ల స్కామ్‌! 67 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు | Rs 820 crore payments scam in UCO Bank CBI raids in 7 cities | Sakshi
Sakshi News home page

ఐఎంపీఎస్‌ లావాదేవీల ముసుగులో 820 కోట్ల స్కామ్‌!

Mar 7 2024 6:14 PM | Updated on Mar 7 2024 7:05 PM

Rs 820 crore payments scam in UCO Bank CBI raids in 7 cities - Sakshi

న్యూఢిల్లీ: ఐఎంపీఎస్‌ లావాదేవీల ముసుగులో జరిగిన భారీ కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో తాజాగా సీబీఐ సోదాలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

యూకో బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంలో కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. రాజ‌స్థాన్‌, మ‌హారాష్ట్ర‌లోని ఏడు న‌గ‌రాల్లో 67 చోట్ల సోదాలు జ‌రుపుతోంది. యూకో బ్యాంక్‌లోని వివిధ ఖాతాల్లో సుమారు 820 కోట్ల అనుమానాస్పద ఐఎంపీఎస్‌ లావాదేవీలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు చేస్తోంది. వివిధ అకౌంట్ల‌లోకి ట్రాన్స్‌ఫ‌ర్ అయిన సొమ్మును మ‌ళ్లీ వెన‌క్కి తెప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు..

ఈ సోదాల్లో భాగంగా యూకో బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీకి చెందిన 130 పత్రాలను అధికారులు సీజ్ చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. 30 మంది అనుమానితులను కూడా విచారించినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు పేర్కొన్నారు.

కాగా గత ఏడాది నవంబర్ 10 నుంచి13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి తమ బ్యాంక్‌కు చెందిన 41,000 ఖాతాలలో ఐఎంపీఎస్‌ అంతర్గత లావాదేవీలు తప్పుగా జరిగినట్లు గుర్తించిన యూకో.. సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నవంబర్ 21న కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది.

దీని ఫలితంగా బదిలీ చేసిన బ్యాంక్‌ ఖాతాల నుంచి డెబిట్ కాకుండానే యూకో బ్యాంక్ ఖాతాల్లో రూ. 820 కోట్లు జమ అయ్యాయి. దీంతో డబ్బులు పడ్డాయని తెలిసిన చాలా మంది ఖాతాదారులు వారి ఖాతాలలోని ఆకస్మిక మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకున్నారు. ఇక 2023 డిసెంబర్‌లోనూ కోల్‌కతా, మంగళూరులోని యూకో బ్యాంక్‌ అధికారులకు చెందిన 13 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది.

చదవండి: సవాల్‌ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్‌నాథ్‌ సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement