ఫొటో వైరల్‌.. మహిళా కానిస్టేబుల్ సస్పెండ్ | Rajasthan woman Consatble suspended For Photo Viral Issue | Sakshi
Sakshi News home page

ఫొటో వైరల్‌.. మహిళా కానిస్టేబుల్ సస్పెండ్

Jun 26 2026 1:30 PM | Updated on Jun 26 2026 2:00 PM

Rajasthan woman Consatble suspended For Photo Viral Issue

జైపూర్: రాజస్థాన్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వృద్ధుడి ఎదుట టేబుల్‌పై కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చున్న మహిళా కానిస్టేబుల్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ సంబంధిత కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

వివరాల మేరకు.. ఈ ఘటన డూంగర్‌పూర్ జిల్లాలోని బిచ్చివాడా పోలీస్ స్టేషన్‌లో జరిగింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ రీనా గర్గ్ తన ఎదుట ఫిర్యాదు కోసం వేచి ఉన్న వృద్ధుడిని పట్టించుకోకుండా టేబుల్‌పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న దృశ్యం ఫొటోలో కనిపించింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే ప్రజల పట్ల ఇలాంటి ప్రవర్తన ఏమిటని ప్రశ్నించారు.

వ్యవహారం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో డూంగర్‌పూర్ ఎస్పీ మనీష్ కుమార్ వెంటనే చర్యలు తీసుకున్నారు. మహిళా కానిస్టేబుల్ రీనా గర్గ్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని గౌరవంగా, సున్నితంగా చూడటం పోలీసుల బాధ్యత అని స్పష్టం చేశారు. వైరల్ ఫొటోలో కనిపించిన తీరు పోలీస్ సేవా నియమాలకు, క్రమశిక్షణకు విరుద్ధమని పేర్కొన్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే, వైరల్ అయిన ఫొటో ఎప్పుడు తీసిందనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఆ ఫొటో నిజానిజాలు, ఘటనకు సంబంధించిన పూర్తి పరిస్థితులను శాఖాపరమైన విచారణలో పరిశీలించనున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాజస్థాన్‌లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement