
తిరువనంతపురం: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ చిక్కుల్లో పడ్డారు. 2024 నవంబర్లో కేరళలోని వయనాడ్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ, బీజేపీ మహిళా నేత నవ్య హరిదాస్ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని స్వీకరించిన హైకోర్టు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు సమన్లు జారీ చేసింది.
గత వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విజయాన్ని సవాలు చేస్తూ, నాటి పోల్ రద్దు కోరుతూ నవ్య హరిదాస్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రియాంకా గాంధీ ఎన్నికల అఫిడవిట్లో తన, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను దాచిపెట్టారని ఆమె ఆరోపించారు. వయనాడ్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె విజయం చెల్లదని ప్రకటించాలని నవ్య కోరారు.
న్యాయవాది అయిన నవ్య హరిదాస్ సమర్పించిన పిటిషన్పై కేరళ హైకోర్టు న్యాయమూర్తి కె బాబు విచారించారు. ప్రియాంక రిటర్నింగ్ అధికారి ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో రాబర్ట్ వాద్రాకు సంబంధించిన పెట్టుబడులు, చరాస్తుల వివరాలను దాచిపెట్టారని నవ్య ఆరోపించారు. వయనాడ్ స్థానంలో విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ స్థానాన్ని వదులుకోవడంతో 2024, నవంబర్ 13న వయనాడ్కు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ స్థానం నుంచి పోటీకి దిగిన ప్రియాంక గాంధీ వాద్రా 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఆమె తన సమీ ప్రత్యర్థి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి చెందిన సత్యన్ మోకేరిని ఓడించారు. నాడు వయనాడ్లో కాంగ్రెస్, సీపీఐ, బీజేపీల మధ్య త్రిముఖపోరు జరిగింది.
ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్ పరారైందిలా..