‘హనీమూన్‌’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్‌ పరారైందిలా.. | Meghalaya Honeymoon Case how Sonam Escaped from Meghalaya | Sakshi
Sakshi News home page

‘హనీమూన్‌’ కేసు: రాజాను ‘మాయం’ చేసి.. సోనమ్‌ పరారైందిలా..

Jun 11 2025 8:32 AM | Updated on Jun 11 2025 9:08 AM

Meghalaya Honeymoon Case how Sonam Escaped from Meghalaya

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన కొత్త జంట రాజారఘువంశీ, సోనమ్‌లు హనీమూన్‌కు వెళ్లి, అదృశ్యమయ్యాక ఈ ఉదంతం పలు మలుపులు తిరుగుతూ, సినిమా కథను తలపిస్తోంది. ఈ ఘటనలో రాజా రఘువంశీ మే 23న హత్యకు గురయ్యాడు. అతని మృతదేహం జూన్ 2న లభ్యమయ్యింది. అతని భార్య సోనమ్‌ ఎక్కడుందో తెలియలేదు. భర్త హత్య దరిమిలా సోనమ్‌పై కూడా దాడి జరిగివుంటుందని, లేదా కిడ్నాప్ చేసివుంటారనే ఊహాగానాలు తొలుత వినిపించాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో సోనమ్ జాడ కనుగొన్నాక మేఘాలయ పోలీసులు.. భర్తను హత్య చేసిన సోనమ్‌ ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నించిందనే వివరాలు సేకరించారు.

ప్రియునితో జతకట్టి..
సోనమ్, రఘువంశీలకు మే 11న వివాహం జరిగింది. ఆ తర్వాత వారు హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లేందుకు మే 21న షిల్లాంగ్ చేరుకున్నారు. ఆ తర్వాత వారు తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలోని చిరపుంజిలోని సోహ్రాకు వెళ్లారు. అయితే సోనమ్‌ తమ కుటుంబం నిర్వహిస్తున్న వ్యాపారంలో ఉద్యోగి అయిన రాజ్ కుష్వాహాను ​ప్రేమిస్తోంది. తల్లిదండ్రుల ఒత్తిడితో రాజా రఘువంశీని వివాహం చేసుకుంది. పెళ్లాయ్యాక ప్రియుని సాయంతో భర్తను అడ్డు తప్పించుకోవాలనుకుంది. ఈ నేపధ్యంలో ప్రియుడు రాజ్ కుష్వాహా తన ముగ్గురు స్నేహితులతో రాజా రఘువంశీ హత్యకు ప్లాన్‌ చేశాడు. సోనమ్ వారికి రూ. 20 లక్షలు చెల్లిస్తానని హామీ ఇచ్చిందని పోలీసులు చెబుతున్నారు.

కొత్త జంటను అనుసరించిన నిందితులు
మే 23న, సోనమ్, రాజా రఘువంశీలు మావ్లాఖియాత్‌లోని  ఒక కొండ పైకి చేరుకుని, జలపాతాన్ని చూడాలనే ఆలోచనతో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఇదే సమయంలో నిందితులు వారిని వెంబడించారు.  ఈ దంపతులు నిర్జన ప్రదేశానికి చేరుకోగానే, రాజా రఘువంశీని అంతమొందించాలని సోనమ్‌ ఆ ముగ్గురు నిందితులను కోరిందని, ఆ తరువాత భర్త మృతదేహాన్ని లోయలో విసిరేయాలని వారికి చెప్పిందని పోలీసులు చెబుతున్నారు. భర్త హత్య తర్వాత సోనమ్.. మావ్‌కాడోక్ నుండి షిల్లాంగ్‌కు టాక్సీలో వెళ్లింది. అనంతరం ఆమె టూరిస్ట్ టాక్సీలో గౌహతికి చేరుకుందని, అక్కడి నుంచి రైలులో ప్రయాణించిందని తూర్పు ఖాసీ హిల్స్ పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సయీమ్ తెలిపారు.

హత్య జరిగిన రోజు..
ఆమె పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం గౌహతి నుంచి రైలులో ఇండోర్‌కు చేరుకుంది. రాజ్ కుష్వాహా కుష్వాహా స్నేహితులైన ముగ్గురు నిందితులు సోహ్రా నుండి గౌహతికి టాక్సీలో వచ్చారు. ఆ తరువాత వారు రైలులో ఇండోర్‌కు  వచ్చారు. రాజా రఘువంశీ హత్య తరువాత సోనమ్‌తో పాటు నిందితులు కేసు నుంచి తప్పించుకునేందుకు పలు ప్రణాళికలు వేసుకున్నారని కేసు దర్యాప్తు చేస్తున్నమేఘాలయ పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. హత్య జరిగిన రోజు ఆమె రాజ్ కుష్వాహాతో టచ్‌లో ఉందని, అతను  ఆ ముగ్గురు నిందితులతో సంభాషించాడని పోలీసులు నిర్ధారించారని ఎస్పీ వివేక్ సయీమ్ పేర్కొన్నారు. అయితే సోనమ్‌, రఘువంశీలు ఇంతకు ముందు మేఘాలయకు వెళ్లి, హత్యకు  అనువైన ప్రదేశాన్ని ఎంచుకున్నారా లేదా అనేది పోలీసులు ఇంకా నిర్థారించలేదు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, ఆ తర్వాత దర్యాప్తు కోసం పోలీసు రిమాండ్‌కు తీసుకువెళతామని ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి: శుభాన్షు అంతరిక్ష ప్రయాణం మళ్లీ వాయిదా

Advertisement
 
Advertisement
Advertisement